ఏపీ Vs తెలంగాణ: రంగంలోకి కోదండరాం, చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం తన అధికారాన్ని వినియోగించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని జేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కొదండరాం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ అడ్వకేట్ల మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ న్యాయాధికారులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన 11 మంది న్యాయాధికారులను, 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయం కాదన్నారు.
ఇలా అందరిని సస్పెండ్ చేస్తూ పోతే ఇంక కోర్టు ఎక్కడ ఉంటుందన్నారు. న్యాయాధికారుల విభజనపై హైకోర్టు తొందపడి నిర్ణయం తీసుకుందన్నారు. న్యాయస్థానాలపై గౌరవం లేదా అన్న వ్యాఖ్యలకు ఆయన ఓ సామెతను ఉదహరించారు. మేము మొక్కితేనే దేవుడివి అయ్యావని లేదంటే లేదు అనే సామెతను హైకోర్టు జడ్జిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
న్యాయాధికారులను సస్పెండ్ చేయడం మూలాన హైకోర్టు ప్రతిష్ఠ బజారు పాలయ్యేలా ఉందన్నారు. కోర్టు తన తీర్పుని సమీక్షించుకోవాలని సూచించారు. హైకోర్టు విభజన అనేది చర్చల ద్వారా అందరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ బాధ్యతలను నిర్వహించకపోవడం వల్లనే లాయర్లు ఆందోళనకు దిగారన్నారు.
తెలంగాణలోని న్యాయాధికారులకు అన్యాయం జరగకూడదనే వారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చానన్నారు. హైకోర్టు వెంటనే న్యాయాధికారులు సస్పెన్షన్లు ఉపసంహరించుకోవాలన్నారు. లాయర్లపై నమోదు చేసిన కేసులను కూడా ఎత్తివేయాలని సూచించారు.
లాయర్లు చేస్తున్న పోరాటం సమంజమైందేనని తెలిపారు. లాయర్లు చేస్తున్న పోరాటానికి యావత్ తెలంగాణ మద్దతుగా నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాయర్లు ఓ శక్తిగా నిలిచారన్నారు. లాయర్లు తొందపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఓపిక నశించొద్దని ఆయన సూచించారు.
లాయర్లు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోందన్నారు. హైకోర్టు విభజన జరుగుతుందని, దానిని మనం సాధిస్తామని ఆయన చెప్పారు. లాయర్లు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ఈ ఉద్యమానికి అందరం మద్దతు తెలుపుతున్నామని అన్నారు.
కాగా లాయర్లు చేస్తున్న ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు హైదరాబాద్కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సాయంత్రం 4.30 గంటలకు ముగియనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు పోలీసులు కేవలం వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతించారు.
ఆందోళనలు విరమించండి: టీ లాయర్లకు చీఫ్ జస్టిస్ భోస్లే
ఇదిలా ఉంటే ఇందిరా పార్కు వద్ద లాయర్లు చేపట్టిన ఆందోళనపై ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ స్పందించారు. లాయర్లు తమ ఆందోళనను విరమించి వెంటనే విధుల్లో చేరాలని చీఫ్ జస్టిస్ దిలిప్ బాబాసాహెజ్ భోసలే విజ్ఞప్తి చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవహారించాలని ఆయన సూచించారు.
చట్ట వ్యతిరేకమైన ఆందోళనలు, సమ్మెలు విరమించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఆందోళన విరమించకుంటే ప్రత్యామ్నాయాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
టీ లాయర్లు బెదిరిస్తున్నారంటూ చీఫ్ జస్టిస్కు ఏపీ న్యాయాధికారుల సంఘం ఫిర్యాదు
హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఏపీ న్యాయాధికారుల సంఘం శుక్రవారం కలిశారు. ఏపీ న్యాయాధికారులను తెలంగాణ న్యాయాధికారులు బెదిరిస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. న్యాయాధికారులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ న్యాయాధికారుల మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.