గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్... తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు వాయిదా...
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి. మంగళవారం(సెప్టెంబర్ 28) నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. తిరిగి అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఉభయసభలు సమావేశం కానున్నాయి.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో కలిసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డాయి.
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీసు, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయితీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు సీఎస్ సూచించారు.
ఈనెల 28, 29వ తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా ఈ రెండు రోజులు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామని.. పరీక్షలు మళ్లీ ఎప్పుడు జరిపేది తర్వాత ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది.హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో సోమ,మంగళవారాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మరో మూడు రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏవైనా ఫిర్యాదులు లేదా సాయం కావాలంటే 040-23202813 నంబర్లో సంప్రదించవచ్చు.