డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కేంద్రం విధానాలపై కేసీఆర్ కీలక చర్చ!
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ నెలలో వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని భావిస్తున్నారు.
ఈ మేరకు సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర ఆదాయం రూ. 40వేల కోట్ల వరకు తగ్గుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో అన్ని విషయాలు ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మరోవైపు, తెలంగాణ మంత్రులు, బంధువుల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక బీజేపీ నేతకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ యుద్ధ వాతావరణమే నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కూడా విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? కేంద్రం విధానాలపై ఏ విధంగా ఎండగడతారనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ నేతలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.