మెడ కోసుకుంటా అన్నారుగా: స్పీడ్ పెంచిన బండి సంజయ్: కేసీఆర్కు బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హానీని కూడా నెరవేర్చట్లేదని ఆరోపించారు. దళితులను అన్ని రకాలుగా మోసగిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్ రూట్లోనే పవన్ కల్యాణ్: వైసీపీ సర్కార్ ఆయువుపట్టును టార్గెట్
మెడ కోసుకుంటా అన్నారు..
తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని, లేకపోతే తాను మెడ కోసుకుంటానని అనేక సార్లు ప్రకటించారని గుర్తు చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ ఆవిర్భావంలోనే దళితులకు మొట్టమొదటి మోసం చేశారని ఆరోపించారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో మాల, మాదిగ సామాజిక వర్గానికి మంత్రిపదవుల్లో అన్యాయం చేశారని విమర్శించారు. హైదరాబాద్లో మాదిగల కోసం అయిదు ఎకరాల్లో మాదిగ భవన్ కట్టిస్తానని అయిదేళ్లు పూర్తయ్యాయని, ఒక్క ఎకరం కూడా కేటాయించలేదని ఆరోపించారు.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం
హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఇచ్చిన హామీ ఏమైందని బండి సంజయ్.. కేసీఆర్ను నిలదీశారు. అంబేద్కర్ విగ్రహానికి, టవర్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారని, ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. ఫాం హౌస్, రాజభవనం దాటి ఎన్నిసార్లు అంబేద్కర్కు నివాళి అర్పించారని ప్రశ్నించారు. అలాంటి సందర్భం ఒక్కటి కూడా లేదని అన్నారు. దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ పట్ల కేసీఆర్కు ఎందుకు కోపం అని ప్రశ్నించారు. దళితులు దీని గురించి పలుమార్లు డిమాండ్ చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
దళితులను దగా..
రాష్ట్రంలో తొమ్మిది లక్షల దళిత కుటుంబాలు ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో ఆరు లక్షలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని గుర్తు చేశారు. మూడున్నర లక్షల కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదని చెప్పారు. 2014-2015 బడ్జెట్లో దళితుల భూపంపిణీకి బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించారని, ఆ తరువాత ఎప్పుడు కూడా ఈ స్థాయిలో నిధులను ప్రస్తావించలేదని విమర్శించారు. ఇది దళితులను మోసం చేసినట్టు కాదా? అని బండి సంజయ్ అన్నారు. భూబ్యాంక్ ద్వారా ఆరు లక్షల ఎకరాలను సేకరించి కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారని ఆరోపించారు. దళితుల కంటే కార్పొరేట్ సంస్థలే ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు.
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం
ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాల కోసం దళితులు ఎదురు చూపులు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. 2014 నుంచి 2019 వరకు 5,33,800 మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకోగా.. 1,16,789 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేశారని విమర్శించారు. బ్యాక్లాగ్, ఎస్సీ, ఎస్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, దళితులకు మూడెకరాల భూమిని పంచి పెట్టాలని, దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.