సాగర్ ప్రజలను కేసీఆర్,జానారెడ్డి మోసం చేశారు... ఈ ఛార్జ్షీట్ ట్రైలర్ మాత్రమే... : బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను టీఆర్ఎస్ ప్రభుత్వం తిరోమన దశలోకి తీసుకెళ్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ విమర్శించారు. కేసీఆర్ పాలన తానీషాను తలపిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్,కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలు ఇప్పటివరకూ నాగార్జునసాగర్కు ఏమీ చేయలేదన్నారు. టీఆర్ఎస్ పాలనపై ఛార్జ్షీట్ను విడుదల చేశారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం(ఏప్రిల్ 6) హాలియా పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో తరుణ్ చుగ్ మాట్లాడారు.
'రాష్ట్రంలో చాలా జిల్లాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం సాగునీరు అందట్లేదు. నాగార్జునసాగర్ ప్రజలను టీఆర్ఎస్,కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు. అలాంటివారికి ఓటెందుకు వేయాలి.' అని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జునసాగర్ ప్రజలను ఎలా వంచించారో వివరిస్తూ ఛార్జ్షీట్ను విడుదల చేసినట్లు తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ చార్జ్షీట్ కేవలం ట్రైలర్ మాత్రమేనని పేర్కొన్నారు. సాగర్ నియోజకవర్గంలో బత్తాయి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్... ఇప్పటికీ దాన్ని నిలుపుకోలేదన్నారు. బత్తాయికి మద్దతు ధర లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎప్పుడు అని స్థానిక రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు.
ఇప్పటివరకూ కనీసం జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్దం చేయలేదని తరుణ్ చుగ్ విమర్శించారు. నెల్లికల్-చింతలపాలెం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 5వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పటివరకూ దాన్ని పూర్తి చేయలేదన్నారు. నాగార్జునసాగర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇక్కడి బీఈడీ కాలేజీనే మరోచోటుకు తరలిస్తోందన్నారు. నియోజకవర్గంలో కనీసం 30శాతం ఇళ్లకు కూడా మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదన్నారు. ఇప్పటికీ పోడు భూముల సమస్య అలాగే అపరిష్కృతంగానే ఉందని... గిరిజనులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
కాగా,ఈ నెల 17న సాగర్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.టీఆర్ఎస్ తరుపున సాగర్ నుంచి నోముల భగత్,కాంగ్రెస్ తరుపున జానారెడ్డి,బీజేపీ తరుపున రవి నాయక్ పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.