Telangana Budget 2020: బడ్జెట్ అంటే గణాంకాలు కావు.. గట్టిగా కోత పడింది.. ప్రసంగంలో హరీష్రావు
దేశ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమం నూతన అధ్యాయాన్ని రచించింది. అహింసా మార్గంలో శాంతియుతంగా సాగిన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాకారం జరిగింది. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ నాయకుడు, దార్శనికుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్టం పరుగులు పెడుతున్నది. ప్రగతి శీల రాష్ట్రంగా రూపుదిద్దుకొంటున్నది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ను రూపొందించాం. ఈ సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నాను అని హరీష్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ప్రసంగంలో హరీష్ వెల్లడించిన విషయాలు ఇవే..
Recommended Video
బడ్జెట్ అంటే అంకెలు కాదు..
బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద వేసుకొనే అంకెల వరుస కావు.. బడ్జెట్ అంటే సామాజిక అభివృద్దిని కాంక్షించే విలువల స్వరూపం. సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. దేశ అర్ధిక వృద్దిరేటు గతేడాది కాలంగా తగ్గుతూ వస్తున్నది. దీంతో కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలోను, గ్రాంట్లలోనూ కోత పడింది. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది అని హరీష్ రావు అన్నారు.
అరకొరగా కేంద్ర నిధులు
2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్ అంచనాల కంటే రూ.3700 కోట్ల మేరకు తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రావడం లేదు. వచ్చే నిధులు కూడ అరకొరగా కేంద్ర ఇస్తున్నది. ఈ కారణాల వల్ల రెవెన్యూ వృద్దిరేటు 2018-19లో 16.1 శాతం ఉంటే.. 2019-20 నాటికి 6.3 శాతానికి తగ్గింది అని హరీష్ రావు తెలిపారు.
ప్రతికూల పరిస్థితుల్లో..
15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే నిధుల శాతం 2.234 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. దీంతో 2020-21 సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు 2384 కోట్లు తగ్గుతాయి. ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయ వనరులను పెంచడం ద్వారా స్వీయ వృద్దిని సాధిస్తున్నాం అని హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
స్వీయ అభివృద్ధితో
ఆర్థిక మాంద్యం, కేంద్ర నిధుల్లో కోతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం స్వీయ ఆదాయ వృద్దితో పూడ్చుకోగలిగాం. 2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ నెలాఖరు వరకు లక్షా 36 వేల కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేసుకోగలుగుతున్నాం అని హరీష్ స్పష్టం చేశారు.