రూ. 1.27 కోట్ల దోపిడీ: పట్టిచ్చిన నేను సైతం సిసిటీవీ కెమెరాలు
Recommended Video
హైదరాబాద్: హైదరాబాదులో మైసూరు నగల వ్యాపారుల నుంచి రూ.1.26 కోట్లను దోపిడీ చేసిన ముఠాను పోలీసులు ఆరుగంటల వ్యవధిలోనే పట్టుకుని తమ సత్తా చాటారు. పూర్తి సొమ్మును రికవరీ చేశారు. దోపిడీ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
మైసూర్కు చెందిన రాజేందర్ అశోక్రోడ్లో రాజేంద్ర బాటరీ వర్క్స్(గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్స్) పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్లో తక్కు వ ధరకు బంగారం లభిస్తుందని అతనికి తెలిసింది. దీంతో తనవద్ద పనిచేసే స్వప్నిల్ మానే, సాంకేత్, సంగప్పలకు రూ.1.26 కోట్లు ఇచ్చి కారులో హైదరాబాద్కు పంపించాడు.
శనివారం హైదరాబాద్కు చేరుకున్న వారు బషీర్బాగ్లోని స్కైలైన్ అపార్ట్మెంట్లోని పేయింగ్ గెస్ట్హౌస్లో బసచేశారు. అయితే హైదరాబాద్లో బంగారం ధర వారు అనుకున్నంత తక్కువ లేకపోవడంతో తిరిగి వెళ్లేందుకు సిద్ధడ్డారు.
సమాచారం ఇలా...
స్కైలాన్ అపార్టుమెంట్లోని 202 ఫ్లాట్ను పేయింగ్ గెస్ట్ రూమ్స్గా నిర్వహిస్తున్నారు. ఇక్కడకు బ్లాక్మనీతో జీరో దందాచేసే వారు ఎక్కువగా వచ్చి బసచేస్తుంటారు. ఇక్కడ రాజస్థాన్కు చెందిన నానాలాల్ కుమావత్ వంటమనిషిగా పనిచేస్తున్నాడు. అతడికి బషీర్బాగ్లో కిరాణ దుకాణం నిర్వహించే పింజర్ల శ్రీహరి యాదవ్తో పరిచయం ఏర్పడింది.
దోపిడీకి ప్లాన్...
పేయింగ్ గెస్ట్ హౌస్కు వచ్చే వారివద్ద పెద్ద ఎత్తున డబ్బుంటుందని, వారిని దోచుకోవడానికి పథకం పన్నిన వారిద్దరూ అవకాశం కోసం ఎదురు చూశారు. మైసూర్ నుంచి వచ్చిన వ్యాపారుల వద్ద డబ్బు ఉండడం గమనించిన నానావల్ వారు బ్యాగులు తీసుకుని బయటకు వెళ్తుండగా శ్రీహరికి సమాచారం ఇచ్చాడు. వెంటనే శ్రీహరి పెంజర్ల కునాల్ యాదవ్తో కలిసి మంచినీళ్ల డబ్బా తీసుకుని అపార్ట్మెంట్కు వచ్చాడు.
లిఫ్ట్లోకి ఎక్కి...
వ్యాపారులు లిఫ్ట్లో ఎక్కుతుండగా వారుకూడా అందులోకి ఎక్కారు. లిఫ్ట్లోనే వ్యాపారులను బెదిరించి సెల్లార్లోకి తీసుకెళ్లారు. శ్రీహరి, కునాల్తోపాటు, సెల్లార్లో ఉన్న కుశాల్ యాదవ్, జామకాయల రమేశ్లు వ్యాపారులను కొట్టి వారివద్దనుంచి నగదు ఉన్న సంచులను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. శ్రీహరి, కునాల్లు రూ. 1.26 కోట్లు ఉన్న బ్యాగ్లతో హోండా యాక్టివాపై అక్కడి నుంచి పరాయ్యారు. ఆ తరువాత దాన్ని నలుగురూ పంచుకున్నారు.
పట్టించిన నేను సైతం కెమెరాలు...
బషీర్బాగ్లో రాజ్కుమార్ తన దుకాణానికి ఏర్పాటు చేసిన నేను సైతం కెమెరాలు దోపిడీ దొంగలకు సంబంధించిన క్లూను పోలీసులకు ఇచ్చాయని సీపీ చెప్పారు. దాని సాయంతో ఈ కేసును ఛేదించామని, కెమెరాలు ఏర్పాటు చేసుకున్న రాజ్కుమార్, వాటి ఏర్పాటుకు సహకరించిన రషీద్లను అభినందించారు.
అరగంటలోనే...
ఆరుగంటల్లోనే కేసు ఛేదించిన ఇన్స్పెక్టర్ రవీందర్, డీఐ రాంబాబు, ఎస్సై శంకర్, క్రైం బృందానికి రివార్డులు ఇవ్వనున్నట్టు సీపీ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టుచేసి, పూర్తిసొత్తును రికవరీ చేశామని చెప్పారు. సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవీస్ పాల్గొన్నారు.