జార్ఖండ్ ముఖ్యమంత్రితో కేసీఆర్ భేటీ: జాతీయ రాజకీయాలపై వ్యూహాత్మకంగా
హైదరాబాద్/రాంచీ: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్లను ఆయన ముంబై వెళ్లి మరీ కలిశారు. ఇప్పుడిక ఆయన జార్ఖండ్కు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ హేమంత్ సోరెన్తో సమావేశం అయ్యారు.
వారికి పరిహారం
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక దాడుల్లో వీర మరణం పొందిన జవాన్లకు కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 20 వీరమరణం పొందిన 20 మంది జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి అయిదు కోట్ల రూపాయలు, మిగిలిన జవాన్లకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నాటి ఘర్షణల్లో అమరులైన జార్ఖండ్కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ఆర్డిక సాయం అందించారు.
ఢిల్లీలో బిజీగా..
కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, రైతు సంఘాల ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయిత్ను ఆయన కలుసుకున్నారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం తీరు సహా పలు అంశాలపై చర్చించారు. దాదాపు రెండు గంటలు చొప్పున ఆ ఇద్దరు నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు, ఎన్డీఏ-యూపీఏలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమిని ఏర్పాటుచేయాల్సిన అవసరం గురించి కేసీఆర్ వారితో మాట్లాడారు.
హేమంత్ సోరెన్తో భేటీ..
ఇప్పుడు తాజాగా కేసీఆర్.. జార్ఖండ్కు వెళ్లారు. హేమంత్ సోరెన్తో సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ను కలుసుకున్న సమయంలో తాను ప్రస్తావనకు తీసుకొచ్చిన అంశాలను కేసీఆర్- జార్ఖండ్ ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి, బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్షత జరుగుతోందనే విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించినట్లు సమాచారం.
కాంగ్రెస్ రహిత కూటమి..
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ప్రస్తావించగా.. దానికి హేమంత్ సోరెన్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. హేమంత్ సోరెన్- జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతున్నారు. తాము లేని ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యమనే అభిప్రాయాన్ని ఇదివరకే కాంగ్రెస్ స్పష్టం చేసింది. అదే అభిప్రాయం హేమంత్ సోరెన్ కూడా వ్యక్తం చేశారని అంటున్నారు.
త్వరలో కేజ్రీవాల్, స్టాలిన్తోనూ..
కాగా కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తోనూ సమావేశం కావాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. కేజ్రీవాల్ను కలిసిన తరువాతే తెలంగాణ వస్తారని అంటున్నారు. త్వరలోనే కేసీఆర్ మరోసారి చెన్నైలో డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ తరువాత తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో భేటీ అవుతారని సమాచారం.