7న మేడారంకు ఫ్యామిలీతో సీఎం కేసీఆర్: వనదేవతలను దర్శించుకున్న 50 లక్షల మంది భక్తులు
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జన జాతర మేడారంకు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకున్నారు.
మేడారంకు కుటుంబసమేతంగా కేసీఆర్..
కాగా, ఫిబ్రవరి 7వ తేదీని కుటుంబసమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నట్లు తెలిసింది. 7న ఉదయం 10.30గంటలకు ఆయన సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని, ఆయనతోపాటు పలువురు మంత్రులు కూడా అమ్మవార్లను దర్శించుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Recommended Video
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు..
ముఖ్యమంత్రి మేడారంను సందర్శించనున్న క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు సీఎం పర్యటకు సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతారయం ఏర్పడుతోంది.
ఇప్పటికే వనదేవతలను దర్శించుకున్న 50లక్షల మంది భక్తులు
గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు సమాచారం. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా. కాగా, ఫిబ్రవరి 5న మేడారం మహాజాతర మొదలవుతుంది.ఫిబ్రవరి 8న ముగుస్తుంది. మహాజాతర ముగిసే వరకు కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు. ప్రధాన ఘట్టం ముగింపు రోజున ఉండటంతో సీఎం కేసీఆర్ అదే రోజున మేడారం జాతరకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
సౌకర్యాలు ఇలా..
కాగా, మేడారం జాతరలో ప్రభుత్వం దాదాపు భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు కొంత అసౌకర్యం తప్పడం లేదు. ఇంకా మెరుగైన వసతి ఏర్పాట్లు చేయాల్సి ఉందని భక్తులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరకు ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
మేడారం జాతర ప్రాముఖ్యత
కాగా, మేడారం జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపు తున్నాయి.