రైతు-మహిళ-యువత నామ సంవత్సరం: సీఎం రేవంత్ న్యూఇయర్ విషెస్ ఇలా
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని, కొత్త ఏడాదిలో ప్రతి పౌరుడి ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇనుప కంచెలను తొలగించాం.. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని తెలిపారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు. 2024ను రైతు-మహిళ యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. కొత్త ఏడాదిలో మిగితా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తామన్నారు.

అభివృద్ధిలో రాష్ట్ర అగ్నభాగాన ఉండాలని ఆకాంక్షించారు. యువత తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి.. వారి భవిష్యత్ కు గ్యారంటీనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.
గత పాలనలో స్తంభించిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు సంకల్పించామని చెప్పారు. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. ప్రజల బాధలు వినేందుకు ప్రజా భవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురుచూశారని.. త్వరలో వాళ్ల కల సాకారమవుతుందన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.
ఆటో, అసంఘటిత కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తామన్నారు సీఎం రేవంత్. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, అభివృద్ధి పథంలో సాగేలా కాంగ్రెస్ పాలన ఉంటుందని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications