యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం కొద్ది గంటల్లో..: యాగ జలాలతో పర్వానికి శ్రీకారం, భక్తుల దర్శనాలు
హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలవర్యుల దర్శనాలకు శుభతరుణం ఆసన్నమైంది. యాదాద్రి సరి కొత్త శోభను సంతరించుకుంది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టి పడుతోంది. సోమవారం ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరగనుంది.

మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి సర్వం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరాయి. ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా రేపు(సోమవారం) పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది. మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి సర్వం సిద్ధమైంది. సోమవారం జరిగే ఈ మహా క్రతువుకు సీఎం కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

స్వామి, అమ్మవారి ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర
ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజ గోపురాల పైన స్వర్ణకలశాలకు మహాకంభ సంప్రోక్షణను ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు. వారం రోజులుగా చేస్తున్న పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలను మహాకుంభంలోకి చేర్చి ఆ పుణ్యజలాలతోపాటు స్వామి, అమ్మవారి ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర చేపడతారు.పునర్ నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొననున్నారు. విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాన్ని కొనసాగిస్తారు.

మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం భక్తుల దర్శనాలు
అనంతరం ప్రధానాలయంలోకి వేద, మంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాలలో ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపడతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు తెరతీస్తారు. ఈ మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బాంబు, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. 400 సీసీ కెమెరాలు, మూడు వేల పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. కాగా, మహా సంప్రోక్షణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రులు, వీఐపిలు పాల్గొంటారని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ కార్య్రమానికి అందరూ ఆహ్వానితులేనని, చిన జీయర్ స్వామికి ఎలాంటి ప్రత్యేక ఆహ్వానం పంపలేదని చెబుతున్నారు. ఆలయ మహా సంప్రోక్షణలో ఎలాంటి శిలా ఫలకాలు కూడా లేవంటున్నారు. సీఎం కేసీఆర్తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications