టీ కాంగ్రెస్లో వర్గపోరు.. రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి.. మధ్యలో వీహెచ్..
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించ లేకపోయారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం రచ్చ అయింది. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ను అయినా మార్చండి లేదా.. ఆయన మైండ్ సెట్ అన్నా.. మార్చాలంటూ అధిష్టానికి లేఖ రాశారు. ఈ లేఖాస్త్రం తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో టీ కాంగ్రెస్లో వర్గవిబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. అటు జగ్గారెడ్డి విషయంలో రేవంత్ తీరును పలువురు సీనియర్లు తప్పుబడుతున్నారు.

రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..
టీ కాంగ్రెస్లో నెలకొన్న రచ్చబండ వివాదంపై ఆపార్టీ సినీయర్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ రాయడాన్ని కొందరు సమర్థిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు జగ్గారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి వ్యహరించిన తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదనలో తప్పు లేదన్నారు. ముఖ్యమంత్రిని ఢీ కొట్టే స్థాయిలో ఒక కార్యాక్రమానికి నిర్వహిస్తున్నప్పుడు .. ముందు సొంత పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలనన్నారు. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి వారిని కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిది కనీస సమాచారం కూడా ఇవ్వకుంటే ఎలా అని వీహెచ్ ప్రశ్నించారు.

తప్పులను సరిదిద్దుకో..
తెలంగాణలో అదికార టీఆర్ఎస్పై దీటుగా పోరాడుతున్న సమయంలో సొంత పార్టీ నేతల విభేదాలు కాంగ్రెస్ నేతల తీవ్ర చర్చనీయాంశమైంది. పీఏసీ సమావేశం జరిగితే .. దీనిపై మరలా రచ్చ జరిగే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొంటున్నారు.. ప్రస్తుతం జరిగిన తప్పులను సరిదిద్దుకొని రేవంత్ ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. అందరిని కలుపుకుపోయేలా మైండ్ సెట్ మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దె దించాలంటూ కాంగ్రెస్ నేతలు విబేధాలను పక్కన పెట్టి గెలుపు కోసం పనిచేయాలని కోరుతున్నారు.

గతంలోనూ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు
రేవంత్ రెడ్డి గతంలోనూ ఇదే తరహాలో ఏకపక్షంగా కార్యక్రమాలను రూపొందించారని ఆ పార్టీ నేతలు కొందరు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా, మూడుచింతలపల్లిలో నిర్వహించిన దళిత , గిరిజన ఆత్మగౌరవ సభపై కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని తప్పుపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్లో పర్యటించినప్పుడు మాజీ మంత్రి గీతారెడ్డికి కానీ, జిల్లాలో పర్యటించేటప్పుడు తనకు కూడా సమాచారం ఇవ్వలేదని గతంలో జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తి గత ఇమేజ్ కోసమే రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్యం ఠాగూర్కి జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడు పెద్ద దుమారమే రేగింది.

ఎవరెన్ని కుట్రలు చేసినా ..
అటు కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కొందరు కాంగ్రెస్ గురించి అవగాహన లేకుండా మాట్లాడతున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఎరరెన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications