సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు: ఇది 13వ సారి: ఈ తరహా ఘటనల్లో 18 మంది మృతి
ములుగు: తెలంగాణలోని ములుగు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు పరస్పరం కాల్పులకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు బుల్లెట్లతో కాల్పులు జరుపుకొన్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. ఏటూరునాగారం ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
మాావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లా ఇది. మావోయిస్టులకు కంచుకోటగా భావించే ఛత్తీస్గఢ్తో సరిహద్దులను పంచుకుంటోంది. మావోయిస్టులను ఏరివేయడానికి తరచూ సరిహద్దుల్లో క్యూంబింగ్ నిర్వహిస్తుంటారు సీఆర్పీఎఫ్ జవాన్లు. దీనికోసం స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకుంటుంటారు. అందుకే సీఆర్పీఎఫ్ జవాన్లను స్థానిక పోలీస్ స్టేషన్లకు అటాచ్ చేస్తుంటారు. ఛత్తీస్గఢ్కు ఆనుకుని ఉన్న వెంకటాపురం పోలీస్ స్టేషన్కు అటాచ్ చేసిన 36వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ కానిస్టేబుళ్ల మధ్య తాజాగా కాల్పులు చోటు చేసుకున్నాయి.
పోలీస్ స్టేషన్ ఆవరణలోని మెస్ వద్ద సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమేశ్ చంద్రపై జవాన్ స్టీఫెన్ రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం స్టీఫెన్ సర్వీస్ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఉమేష్ చంద్ర స్వరాష్ట్రం బిహార్. కానిస్టేబుల్ స్టీఫెన్ కన్యాకుమారి.
సెంట్రీ డ్యూటీల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, క్షణికావేశంతో కాల్పులు చోటు చేసుకున్నాయనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఎస్ఐ ఉమేష్ చంద్ర మరోసారి సెంట్రీ డ్యూటీని తనకే వేయడం పట్ల స్టీఫెన్ అభ్యంతరం వ్యక్తం చేశాడని, ఇది కాస్తా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసిందని చెబుతున్నారు. వాగ్వివాదం పతాక స్థాయికి చేరుకోవడంతో ఆగ్రహం పట్టలేక స్టీఫెన్.. ఎస్ఐపై కాల్పులు జరిపారు.
రెండు బుల్లెట్లు ఎస్ఐ ఉమేష్ చంద్ర ఛాతీని, మరొకటి పొట్టలో దూసుకెళ్లినట్లు తేలింది. కాగా- ఇప్పటిదాకా సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య ఈ తరహా కాల్పులు చోటు చేసుకోవడం ఇది 13వ సారి అని తెలుస్తోంది. ఈ తరహా ఘటనల్లో 18 మంది మరణించినట్లు సమాచారం. ఏకధాటిగా విధి నిర్వహణల్లో పాల్గొనాల్సి రావడం, రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉండటం వంటి మానసికపరమైన ఒత్తిళ్లను సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదుర్కొంటోన్నారని, ఆ కారణంతోనే పరస్పరం కాల్పులకు దిగుతున్నారనే అంచనాలు ఉన్నాయి.