తెలంగాణ ప్రజలకు ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు- జెండా ఎగరేసిన జీ కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని అధికార భారత్ రాష్ట్ర సమితి. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. నేడు పదో వసంతంలోకి తెలంగాణ అడుగు పెట్టింది. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా జరుపుతోంది.
ఈ నెల 22వ తేదీ వరకు ఈ సంబరాలు కొనసాగనున్నాయి. ఈ 21 రోజులపాటు తెలంగాణ వాడవాడలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను జరుపుకోవడానికి ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించింది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకుంటోంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము- తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకొంటోన్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ.. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు. ఎందరో మేధావులు, త్యాగధనులను దేశానికి అందించిందని పేర్కొన్నారు. అడవులు, వన్యప్రాణులతో అలరారుతోందని చెప్పారు.
ఈ అందమైన రాష్ట్రం- సాంకేతికరంగంలో పరుగులుపెడుతోందని, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగానికి చిరునామాగా నిలిచిందని ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు సుదీర్ఘకాలం పాటు కొనసాగాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లోనూ మరింత పురోగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోన్నానని పేర్కొన్నారు.
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని బలంగా విశ్వసిస్తోన్నామని వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దీన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications