తెలంగాణలో త్వరలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు.. ఎక్కడెక్కడో తెలుసా..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కాబోతున్నాయి.ఈ మేరకు తాజాగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. 1. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం బహదూర్పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, 2. మెదక్ జిల్లా సదాశివ్పేట మండలం కంకోల్లో వోక్సెన్ యూనివర్సిటీ, 3. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దూళపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, 4. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లో ఎస్ఆర్ యూనివర్సిటీ, 5. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు 2018లోనే అసెంబ్లీలో ఆమోదం పొందింది. తెలంగాణలో విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు,కింది వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అప్పటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ వర్సిటీల్లో 25శాతం సీట్లను కూడా స్థానికులకే రిజర్వ్ చేయాలన్న నిబంధన పెట్టామన్నారు. కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయని.. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలపై రాద్దాంతం అవసరం లేదని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది.