ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం... మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నుంచి ఉపాధ్యాయుల వివరాలను ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు schooledu.telangana.gov.in వెబ్సైట్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయాలని సూచించింది.
ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతా నంబర్,ఆధార్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పింది. ఆ వివరాలను ఎంఈవోలు,డీఈవోలు పరిశీలిస్తారని తెలిపింది. శనివారం(ఏప్రిల్ 9) నుంచి ఏప్రిల్ 15 వరకు పాఠశాలల నుంచి వివరాల సేకరణ,16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వాటి పరిశీలన,ధ్రువీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇదే నెల 20 నుంచి 24 తేదీల్లో అర్హులైన ఉపాధ్యాయుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున నగదు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే 21 నుంచి 25వ తేదీ వరకూ బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
ఇదే అంశంపై శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, పౌరసరఫరాల శాఖతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్,ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగదు సాయం అందించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై సమావేశంలో చర్చించారు. ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయుల వివరాలను సేకరించనున్నట్లు సమావేశం అనంతరం మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెలా రూ.2వేలు నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయనున్నారు.ప్రస్తుతం కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి.. వేతనాల్లేక కుటుంబాన్ని పోషించుకోలేని దయనీయ స్థితిలో ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆలోచించి ప్రైవేట్ టీచర్లకు నగదు సాయంతో పాటు బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది.