హనుమకొండ బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: షరతులు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 27వ తేదీన సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ క్రమంలో సభకు పోలీసుల నుంచి అనుమతి లేదని, ఈ కారణంగానే అనుమతి రద్దు చేస్తున్నట్లు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలిపారు. దీంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరని హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
బండి పాదయాత్ర ఆపాలంటూ సర్కారు వేసిన పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్ పాదయాత్రను ఆపాలంటూ పోలీసులిచ్చిన నోటీసును హైకోర్టు సింగిల్ జడ్జి గురువారం సస్పెండ్ చేసి, ప్రజాసంగ్రామ యాత్రకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్పై అత్యవసర విచారణ చేపట్టాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.