ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం... కేంద్రంపై హైకోర్టు సీరియస్.. మళ్లీ అదే తీరు..
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(డిసెంబర్ 16) విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని... 2023 వరకూ దాన్ని పొడగించుకున్నారని కేంద్ర హోంశాఖ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అఫిడవిట్కు బదులుగా మెమో దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video

ఎంబసీ కార్యాలయం నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఇక ఎందుకు మీ హోదాలు అని ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మెమోనే మళ్లీ సమర్పించడాన్ని తప్పు పట్టింది. మరోమారు అవకాశం ఇస్తున్నామని... తదుపరి విచారణకు అఫిడవిట్తో రావాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. చెన్నమనేని పౌరసత్వంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నవంబర్ 18న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. అయినప్పటకీ పాత మెమోనే మళ్లీ సమర్పించిన కేంద్రం తరుపు న్యాయవాది హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు.

వేములవాడ కాంగ్రెస్ ఇన్చార్జి ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ బాబు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న క్రమంలోనే కేంద్ర హోంశాఖ చెన్నమనేని భారత పౌరతసత్వాన్ని రద్దు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ చెన్నమనేని రమేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గత కొద్ది నెలలుగా చెన్నమనేని పౌరసత్వంపై విచారణ కొనసాగుతూ వస్తోంది.
గత ఏడాది చెన్నై నుంచి జర్మనీ వెళ్లిన చెన్నమనేని రమేష్ జర్మన్ పాస్ పోర్టు పైనే ప్రయాణం చేశారన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను హైకోర్టు సమర్థిస్తే ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లకుండా పోతుంది. అదే జరిగితే వేములవాడకు ఉపఎన్నిక ఖాయం. ఈ నేపథ్యంలో వేములవాడలో విపక్ష పార్టీలు ఇప్పటికే ఉపఎన్నిక దిశగా కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇన్చార్జి ఆది శ్రీనివాస్ ఈ దఫా తానే ఎమ్మెల్యే అవుతానన్న ధీమాను సన్నిహితుల వద్ద వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ కూడా ముగ్గురు నేతల పేర్లను పరిశీలనకు సిద్దంగా ఉంచుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications