ఇంటర్ ఫలితాల్లో అంతులేని నిర్లక్ష్యం.. రీవెరిఫికేషన్లో కూడా అంతే సంగతి..!
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడించాలని కోర్టు గడువు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. విద్యార్థులు ఎదురుచూసి ఇక ఫలితాలు రావేమో అనుకుంటున్న తరుణంలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇంటర్ బోర్డు అసంపూర్ణంగా ఫలితాలు విడుదల చేసింది.
3 లక్షల 82 వేల 116 మంది విద్యార్థుల జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేస్తామన్న బోర్డు అధికారులు.. అందులో 1,137 మంది మాత్రమే పాసయ్యారని ప్రకటించారు. ఆ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో మాత్రమే మార్పులున్నాయని.. మిగతా విద్యార్థుల రిజల్ట్స్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడం గమనార్హం.
కేటీఆర్ ఫెయిల్.. హరీష్ రావు పాస్.. ఇంతకు ఆ లెక్కలు ఏమిటంటే..!
తప్పుల తడక.. గందరగోళం.. ఈసారి కూడా..!
ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. ఫలితాలు తప్పుల తడకగా వచ్చాయంటూ కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు విపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చి రీవెరిఫికేషన్ ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఆ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో కూడా అయోమయం నెలకొనడం మరింత గందరగోళానికి కారణమైంది.
3 లక్షల 82 వేల 116 మంది విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయిస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఆ మేరకు హైకోర్టులో కొందరు వేసిన వ్యాజ్యం మేరకు రెండు సార్లు గడువు కోరారు. అయితే ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థుల జవాబు పత్రాలను, రీవెరిఫికేషన్ తర్వాత ఫలితాలను, సబ్జెక్టు వారీగా మార్కులను ఆన్లైన్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా బోర్డు అధికారులు సరిగా స్పందించలేదు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు.. రాత్రి సమయంలోనా ఫలితాలొచ్చేది..!
కోర్టు ఆదేశాల దృష్ట్యా ఇంటర్ బోర్డు సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలను ప్రకటిస్తుందని విద్యార్థులు ఎదురుచూశారు. కానీ రాత్రి సమయంలో 9 గంటల 30 నిమిషాలకు రిజల్ట్స్ విడుదల చేశారు అధికారులు. జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచాలన్న కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. 3 లక్షల 82 వేల 116 మంది విద్యార్థులు ఫెయిలైతే అందులో 1,137 మంది మాత్రమే పాసయినట్లు వెల్లడించారు. వెబ్సైట్లో పాసయిన విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే పెట్టడం అనుమానాలకు తావిస్తోంది.
రీవెరిఫికేషన్లో పాసయిన 1,137 మంది విద్యార్థుల్లో 585 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. రెండో సంవత్సరం విద్యార్థులు 552 మంది ఉన్నారు. ఒక మార్కుతో పాసైన విద్యార్థులు 88 మంది ఉండగా, రెండు మార్కులతో పాసయినవారు 156 మంది ఉన్నారు. ఇక మూడు మార్కులతో 161 మంది, నాలుగు మార్కులతో 140 మంది, ఐదు మార్కులతో 95 మంది, ఆరు మార్కులు అంతకన్నా ఎక్కువ మార్కులతో పాసయినవారు 497 మంది ఉన్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు.
ఆత్మహత్య చేసుకున్నోళ్లు పాస్ కాలేదట..!
ఇక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన వివరాలు చూస్తే.. చనిపోయిన 23 మంది విద్యార్థుల్లో 20 మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్లోనూ ఫెయిలయ్యారని బోర్డు అధికారుల ప్రకటించారు. ఆ విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను రెగ్యులర్ లెక్చరర్లు పరిశీలించగా ఫలితాల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులేమో అప్పటికే ఉత్తీర్ణులయినట్లు పేర్కొన్నారు. మరొక విద్యార్థిని మూడు పరీక్షలు రాసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఆమె రాసిన మూడు పరీక్షల్లోనూ పాసయినట్లు తెలిపారు.
ఆ విద్యార్థుల ఫలితాలకు మరో మూడు రోజులట..!
కొంతమంది పరీక్షల్లో పాసయినప్పటికీ.. తమ అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సి ఉందనే నమ్మకంతో రీవెరిఫికేషన్కు అప్లై చేశారు. అయితే వీరికి సంబంధించిన ఫలితాల వెల్లడికి మరో మూడు రోజుల సమయం పడుతుందని బోర్డు అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. అదలావుంటే ఫెయిలైన విద్యార్థులకు సంబంధించి రీవెరిఫికేషన్ ఫలితాలను, స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను బోర్డు వెబ్సైట్ నుంచి పొందొచ్చని పేర్కొన్నారు. కానీ వాటి జాడే కనిపించడం లేదు.
మొత్తానికి ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాల వెల్లడి మరోసారి అయోమయానికి కారణమైంది. రీవెరిఫికేషన్కు బదులు రీవాల్యూయేషన్ చేయిస్తే ఫలితాల్లో భారీ తేడా కనిపించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదలావుంటే రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఉచితంగా చేయిస్తామనే ప్రభుత్వ హామీ మేరకు.. అంతకుముందే ఫీజు చెల్లించిన దాదాపు 20వేల మందికి పైగా డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నారు బోర్డు అధికారులు.