గృహహింస కేసుల్లో దేశంలో టాప్2 లో తెలంగాణా; టాప్1 లో ఎవరంటే!!
భారతదేశంలో గృహహింస కేసులకు సంబంధించి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో గృహహింస కేసుల జాబితాలో 50.4% తెలంగాణ రెండవ స్థానంలో ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఈ జాబితాలో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. 75% గృహహింస కేసులతో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఆపై తెలంగాణ రాష్ట్రం 50.4 శాతం గృహింస కేసులతో రెండవ స్థానంలో, 48.9%తో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచాయి. ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులలో మూడో వంతు దాడులు ఆమె భర్త, బంధువులు చేస్తున్న దాడులే కావడం గమనార్హం.

దేశంలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న హింసకు సంబంధించిన కేసులను బట్టి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించిన సర్వే ప్రధానంగా మహిళలు ఉద్దేశపూర్వక దాడులు, కిడ్నాప్, అత్యాచార యత్నాలు వంటి వాటిని ఎదుర్కొంటున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులలో లక్షలలో కేసులు నమోదు అవుతుంటే, పరిష్కారం అవుతున్న కేసులు మాత్రం వేలల్లోనే ఉంటున్నాయి.
2021 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 21.22 లక్షల కేసులు కోర్టులలో ఉంటే ఇప్పటివరకు దేశంలో పరిష్కృతమైన కేసులు 83,536 మాత్రమే.
ఇక ఈ కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని కూడా సర్వే నివేదిక వెల్లడించింది. 2015 - 2016 లో 33.3% గృహహింస కేసులు ఉండగా, 2019 2021 నాటికి ఇవి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు ఈ కేసులు పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా నమోదైన కేసులు త్వరిత గతిన పరిష్కరించాల్సిన అవసరం మాత్రమే కాదు, గృహ హింస కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి అందుకు తగిన పరిష్కార మార్గాలు చూస్తే బాగుంటుందిన్న అభిప్రాయం ఈ నివేదికతో వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications