అలా అయితేనే సమస్యకు పరిష్కారం: సుప్రీం చీఫ్ జస్టిస్తో టి లాయర్ల భేటీ
న్యూఢిల్లీ: న్యాయాధికారుల నియామకాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు చేపట్టిన నిరసన వెంటనే విరమిస్తే.. తాను సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ హామీ ఇచ్చారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు తెలిపారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఆయన నివాసంలో తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిసి తమ సమస్యలు వివరించారు.

అనంతరం న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ... న్యాయాధికారుల నియామకాలు వెంటనే నిలిపివేయాలని, న్యాయమూర్తుల సస్పెన్షన్ను ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించేలా జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. గంట పాటు సాగిన సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి సావధానంగా విన్నారని న్యాయవాదులు తెలిపారు.
కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయాధికారుల నియామకాలు జరిగిన విషయాన్ని సీజే దృష్టికి తీసుకెళ్లామని, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఓ కమిటీ వేసి నియామకాలు జరపాలన్న అంశంపై ప్రధాన న్యాయమూర్తి కూడా అంగీకరించారన్నారు. ఈ విషయంపై న్యాయశాఖ మంత్రితో చర్చిస్తామని చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ చెప్పారని తెలిపారు.

న్యాయవాదులు నిరసన విరమించుకుంటేనే తాను జోక్యం చేసుకుంటానని, లేని పక్షంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించారని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ న్యాయవాద జేఏసీ నేతలు చెప్పారు.
ఇది ఇలా ఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్ దవేతో కూడా తెలంగాణ న్యాయవాదుల బృందం భేటీ అయింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడం, న్యాయవాదుల ఆందోళన తదితర అంశాలపై దవేకు లాయర్లు వివరించారు.












Click it and Unblock the Notifications