ప్రముఖ కవి గూడ అంజయ్య కన్నుమూత: కెసిఆర్ సంతాపం
ఆదిలాబాద్: ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూశారు. ప్రముఖ రచయిత బోయ జంగయ్య మరణం నుంచి సాహిత్య లోకం కోలుకోక ముందే గూడ అంజయ్య మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గూడ అంజయ్య గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో, కామెర్లతో బాధపడుతున్నారు.
ఆయన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని రాగన్నగూడెంలోని తన స్వగృగంసో మరణించారు. ఆయన 1955లో ఆదిలాబాద్ జిల్లా లింగపురంలో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పలు పాటలు రాశారు. రాజిగ ఒరి రాజిగా... వంటి పలు పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించాయి.
నేను రాను బిడ్డో మన వూరి దవాఖానాకి.. అనే సినిమా పాట అందరి నోళ్లలోనూ నానుతోంది. ఊరు మనదిరో వాడ మనదిరో అనే విప్లవ గీతం రాసింది కూడా ఆయనే. ఆయన ఓ కథల సంపుటిని కూడా వెలువరించారు. పొలిమెర అనే నవల కూడా రాశారు.
ఆయన పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు ప్రభుత్వం సాయం కూడా అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్ధాయి అవార్డును కూడా అందుకున్నారు. వృత్తిరీత్యా ఆయన ఫార్మసిస్ట్. ఆయన ఊరు మనదిరా పాట 16 భాషల్లోకి అనువాదమైంది. తెలంగాణ ప్రజలు ముద్దుగా ఆయన గూడ అంజన్న అని పిలుచుకుంటారు.
ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. అంజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక సామాజిక అంశాలపై అంజన్న గేయాలు రాసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ సమాజానికి అంజయ్య చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.