తెలుగు మహిళకు ఇండిగో విమానంలో అవమానం: మంత్రి కేటీఆర్ సీరియస్
హైదరాబాద్: అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఎలాగున్నా.. కనీసం దేశీయంగా ప్రయాణించే విమాన ప్రయాణికులకు సరైన గౌరవం దక్కడం లేదు. మాతృభాష మాత్రమే తెలిసిన ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఇండిగో విమానంలో తెలుగు మహిళకు అవమానం
ఇండిగో విమానంలో తెలుగు ప్రయాణికురాలికి ఎదురైన అవమానకర ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇంగ్లీష్/హిందీ రాదన్న కారణంతో ఓ తెలుగు మహిళను విమానంలో కూర్చున్న సీట్లోంచి తీసుకెళ్లి.. మరో చోట కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 16న విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ప్రొఫెసర్ ట్వీట్పై స్పందించిన కేటీఆర్
సెప్టెంబర్ 16న ఇండిగో 6ఇ 7297లో ఓ తెలుగు మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. 2ఏ(ఎక్స్ఎల్ సీటు, ఎగ్జిట్ రో)లో ఆమె కూర్చోని ఉండగా.. ఆ మహిళకు హిందీ/ఇంగ్లీష్ రాదని తెలుసుకుని.. 3సీ సీట్లోకి మార్చేశారు విమాన సిబ్బంది. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ భద్రతా పరమైన ఆందోళనగా పేర్కొంటూ ఆ మహిళ పట్ల విక్షక్ష ప్రదర్శించారు అని దేవస్మిత ట్విట్టర్లో ఫొటోను పోస్టు చేసి పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.
స్థానిక భాష మాట్లాడేవారికీ గౌరవం ఇవ్వాలంటూ కేటీఆర్
ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేస్తూ.. ఇక నుంచైనా స్థానిక భాషలు మాత్రమే మాట్లాడగలిగిన ప్రయాణికులను కూడా గౌరవించాలని సూచించారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేని ప్రయాణికుల్ని కూడా గౌరవించాలన్నారు. విమానాలు ప్రయాణించే రూట్ల ఆధారంగా ఆయా భాషలు మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అలా అయితే ప్రయాణికులకు, సిబ్బందికి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. అయితే, భద్రతా కారణాలతోనే ఇలా చేసివుంటారని పలువురు నెటిజన్లు విమాన సిబ్బందికి మద్దతుగా అభిప్రాయాలు చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ విషయంపై ఇండిగో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications