వారిద్దరి మధ్యా చీకటి స్నేహం- బయటపెట్టినందుకే: రేవంత్ రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
ఈ సెక్షన్ల కింద..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్- కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది. సూరత్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ లో ఆయనపై సీసీ/18712/2019 కింద కేసు నమోదైందని తెలిపింది.

కాంగ్రెస్ భగ్గు..
రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకంటించడం పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడిన గౌతమ్ అదాని గురించి ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తాయి. అదాని కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన తరువాత పార్లమెంట్ కు ముఖం చూపించే పరిస్థితి ప్రధాని మోదీకి గానీ, బీజేపీ నాయకులకు గానీ లేదని అన్నారు. అందుకే ఇలా రాజకీయంగా కక్షసాధింపు చర్యలను తీసుకున్నారని విమర్శించారు.
జేపీసీ గురించి..
అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి తాము డిమాండ్ చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కావాలంటే జైలుకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామంటూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అటు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఈ ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు.

జీర్ణించుకోలేని బీజేపీ..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్రను చేపట్టారని, ఈ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలకు చేరువ అయ్యారని చెప్పారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులెవ్వరూ దాన్ని సహించలేకపోతోన్నారని పేర్కొన్నారు. గౌతమ్ అదాని- మోదీ చీకటి స్నేహంపై నిలదీయడాన్నిజీర్ణించుకోలేకోతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
అదానీపై చర్చ పక్కదోవ పట్టించేందుకే రాహుల్ పై అనర్హతవేటన్న @revanth_anumala#Revanthreddy #oneindiatelugu #BJP #Tcongress pic.twitter.com/fBeSi5lDzO
— oneindiatelugu (@oneindiatelugu) March 24, 2023
న్యాయపోరాటం..
అదానీ కంపెనీల వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ పార్టీ కమిటీ వేయాలంటూ ఉభయ సభల వేదికగా రాహుల్ గాంధీ ఎడతెగని పోరాటం చేస్తోన్నారని అన్నారు. ఇవన్నీ ప్రధాని మోదీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని, అందుకే రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసి కక్షసాధించుకుంటోన్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేధించి తీరుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications