రేవంత్రెడ్డి 250 రోజుల పాలనపై సర్వే
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎ.రేవంత్ రెడ్డి తన పాలనకు 250 రోజులు పూర్తిచేసుకున్నారు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో 250 రోజులు అంటే తక్కువ సమయమే అయినప్పటికీ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం, మరికొన్ని పథకాల అమలు నెమ్మదిగా జరుగుతుండటంతో ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై తెలంగాణలో ఓ సంస్థ సర్వే చేపట్టింది.
20 జిల్లాల్లో అభిప్రాయాలు
రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి పదోతేదీ వరకు ప్రజల అభిప్రాయాలను ఆ సంస్థ సేకరించింది. ఇందులో 72 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలనపై సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు చాలా బాగుందని, ప్రజలకు బాగా దగ్గరైన ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారని సర్వే సంస్థ వెల్లడించింది. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి.

వెంటనే స్పందించడం కలిసొస్తోంది
నిరాడంబరంగా ఉండటం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు ఏ విషయంపైనా వెంటనే స్పందించడంతోపాటు ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తుండటం రేవంత్ రెడ్డికి సానుకూల అంశాలయ్యాయి. రైతు రుణమాఫీ బాగా కలిసివచ్చింది. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగం కాంగ్రెస్ సర్కారువైపే మొగ్గుచూపింది. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలతే నమోదైంది. ఆడంబరాలకు దూరంగా ఉండటం ప్రస్తుత ప్రభుత్వానికి బాగా కలిసివచ్చింది.
ఆర్టీసీ ఎంతో మేలు చేసింది
రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజ్ ను రూ.10 లక్షలకు పెంచడం, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం.. ఈ రెండు అంశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చిందని సర్వే సంస్థ పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ప్రజల నుంచి భారీ మద్దతు దొరకడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలు తమ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చేలా చేశాయన్నారు.












Click it and Unblock the Notifications