తెలంగాణా టీడీపీలో కొత్త రచ్చ .. అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబుకు లేఖలు .. రీజన్ ఇదే
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. నాయకత్వ మార్పు కోసం తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు నాయుడిని ఆశ్రయిస్తున్నారు. గత ఏడేళ్లుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక్కరే ఉన్నారని, పార్టీ పునరుజ్జీవం పొందాలంటే అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. స్వయంగా కలిసి విన్నవించుకున్నారు. అయితే తెలంగాణలో టిడిపి మనుగడ విషయంలో,పార్టీని ముందుకు నడిపించే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంతర్మథనంలో ఉన్నట్టుగా సమాచారం.

పార్టీ పునరుజ్జీవం కోసం టీడీపీ నేతల యత్నం
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పట్టును కోల్పోయింది. ఇక గత ఎన్నికల సమయంలో టిడిపి మరింత చతికిలబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీకి జవజీవాలను అందించడంతో పాటుగా, పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నం జరగడం లేదని టిడిపి నేతలలో అసహనం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబుకు పలువురు టీడీపీ నేతలు లేఖ రాశారు.

నాయకత్వ మార్పుకు డిమాండ్ .. చంద్రబాబుకు లేఖలు
అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ, గత ఏడేళ్లుగా తానే అధ్యక్షుడుగా ఉండటం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలముకుందని ,ఉత్సాహం లేదని ,తక్షణ నాయకత్వ మార్పుపై దృష్టి సారించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. లేఖలు రాస్తున్నారు .
టిడిపిలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడి బయటకు వెళ్లడంతో పార్టీ బలహీనపడింది. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పటినుండి ఇప్పటివరకు రమణ ఒక్కడే పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అయినా, చంద్రబాబు పట్టించుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.

నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన చెయ్యాలని విజ్ఞప్తి
ఇప్పటికైనా బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించి, పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవాలని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నకారణంగా వారిని కాపాడుకోవలసిన అవసరం ఉందని క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్ లను నియమిస్తే కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి వెసులుబాటు కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

మనుగడ కోసం తెలంగాణా టీడీపీ పోరాటం .. బాబు దృష్టి పెడతారా ?
పార్టీలో నూతనోత్సాహం నింపి, పార్టీని ముందుకు నడిపించకుంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైంది. అధికార పార్టీ పై ఏమాత్రం ఒత్తిడి తీసుకు రాలేని పార్టీగా, మనుగడ కోసం పోరాటం చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోయింది. తెలుగు రాష్ట్రాల విభజన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ప్రస్తుత పరిస్థితుల్లో అయినా తెలంగాణ టిడిపిపై దృష్టి సారిస్తారా ? అధ్యక్షుడితో పాటుగా,తెలంగాణ నాయకత్వాన్ని మారుస్తారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications