రేవంత్ని టార్గెట్ చేశారు: టీడీపీ, కేసీఆర్ బొమ్మ దగ్ధం
హైదరాబాద్: అసెంబ్లీలో తమ పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డిని అధికార తెరాస పార్టీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభాపతి పైన ఉందని తెలంగాణ టీడీపీ నేతలు అన్నారు. మధ్యాహ్నం వారు సభాపతి మధుసూదనాచారితో భేటీ అయ్యారు.
అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై రెండు పేజీల లేఖను ఆయనకు అందజేశారు. బీఏసీలో ఇద్దరికి అవకాశం ఇస్తామని ముందు చెప్పి, ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. పరిస్థితులను చక్కదిద్ది తమ సభ్యుడు మాట్లాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
విద్యుత్, సమగ్ర కుటుంబ సర్వే, సిమెంట్ ధరలు, డీఎల్ఎఫ్పై తమ సభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, పార్టీ ఆదేశాల మేరకే సభ్యులు మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. అధికార పక్షం తమ సభ్యుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందన్నారు.
కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ మధుసూదనాచారిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు కోరారు. ఈ విషయంపై లిఖిత పూర్వకంగా సాయంత్రం స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని మధ్యాహ్నం చెప్పారు. కాగా, సాయంత్రం స్పీకర్ను కలిసిన టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిల పైన అనర్హత దాఖలు చేయాలని లిఖితపూర్వక పిటిషన్ ఇచ్చింది.
కేసీఆర్ను కలిసిన పాలమూరు ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో పాలమూరు ఎమ్మెల్యేలు కలిశారు. డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇస్తే ప్రాజెక్టు ఎత్తు పెంచుతారని, దానివల్ల పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. అటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
కేసీఆర్ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల నిరసన
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న కేసుల ఎత్తివేతపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కొత్త ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. ఉద్యోగాల భర్తీ కోసం తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.