సాగర్లో పోలింగ్ డ్యూటీ-కరోనా సోకిన టీచర్ మృతి-ఒక్క ఎమ్మెల్యే కోసం ఎంతమంది బలైపోయారంటూ భర్త ఆవేదన
దేశంలో ఎంతోమంది టీచర్లు కరోనా కాటుకు బలైపోతున్నారు. వీళ్లల్లో ఎక్కువమంది నెల క్రితం జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,ఉపఎన్నికల విధుల్లో పాల్గొన్నవారే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లలో దాదాపు 1600 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ఉపాధ్యాయ సంఘం చెబుతోంది. కరోనా వేళ ఎన్నికలు నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా పట్టించుకోలేదు. ఫలితంగా వందలాది మంది టీచర్లు కరోనాకు బలైపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారినపడి మృతి చెందిన ఓ టీచర్ విషాదాంత ఘటన తాజాగా తెలంగాణలో వెలుగుచూసింది.

ఎవరా టీచర్...
తెలంగాణలో ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. హాలియా పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సంధ్య(35) అనే టీచర్ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మూడు రోజులకే ఏప్రిల్ 20న ఆమె కరోనా బారినపడ్డారు. వారం రోజుల పాటు ఇంటి వద్దే మందులు వాడిన ఆమె... ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మే 8న మృతి చెందారు.

చిన్నాభిన్నమైన కుటుంబం...
సంధ్య మృతితో తమ కుటుంబం చిన్నాభిన్నమైందని ఆమె భర్త కమ్మంపాటి మోహనరావు వాపోతున్నారు. 'నేను కోల్పోయింది నా భార్యను కాదు... నా జీవితాన్ని. ఎన్నికలు ఎందుకు నిర్వహించారు... ఒక్క ఎమ్మెల్యే ఎన్నిక కోసం ఎంతోమంది బలైపోయారు. నా కుటుంబం చిన్నాభిన్నామైంది. లాక్ డౌన్ తర్వాత లేదా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సింది.' అని మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ ఉపఎన్నికకు మూడు రోజుల ముందు ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా పట్టణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్నవారిలో సీఎం కేసీఆర్ సహా పలువురు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

మృతురాలి భర్త ఆరోపణలు...
పోలింగ్ రోజు కోవిడ్ ప్రోటోకాల్స్ను అధికారులు తుంగలో తొక్కారని మోహనరావు ఆరోపించారు. ఒక్క బస్సులో 30 పైచిలుకు మంది పోలింగ్ స్టాఫ్ను పోలింగ్ కేంద్రాలకు తరలించారని చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఒక చిన్న గదిలో దాదాపు 10 మంది స్టాఫ్ 12 గంటల పాటు విధులు నిర్వర్తించారని తెలిపారు. కనీసం పోలింగ్ కేంద్రాల వద్ద టెంపరేచర్ కూడా చెక్ చేయలేదని... చివరి గంటలో కోవిడ్ పేషెంట్లు ఓటేయడానికి వచ్చినప్పుడైనా సిబ్బందికి పీపీఈ కిట్ ఇవ్వలేదని ఆరోపించారు. 'పోలింగ్ విధుల్లో పాల్గొన్న నా భార్య సంధ్య 430 మంది ఓటర్లకు ఇంక్ ముద్ర వేశారు. ఒక చిన్న గదిలో పోలింగ్ నిర్వహిస్తే భౌతిక దూరం పాటించడం ఎలా సాధ్యమవుతుంది. ఒక్కో వ్యక్తి గుర్తింపు కార్డును పరిశీలించి,ఇంకు వేసి,సంతకం తీసుకోవడానికి కనీసం ఒకటి లేదా రెండు నిమిషాలు పడుతుంది..' అని పేర్కొన్నారు.

ఇప్పటివరకూ 15 మంది టీచర్లు...
తెలంగాణలో ఉపఎన్నిక విధుల్లో పాల్గొన్నవారిలో మొత్తం 500 మంది టీచర్లు కరోనా బారినపడినట్లు ఇటీవల హైకోర్టు దృష్టికి వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు,15 మంది టీచర్లు కరోనా బారినపడి చనిపోయినట్లు హైకోర్టుకు పిటిషనర్ తెలియజేశారు. దీంతో కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు పేర్కొంది. వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications