తెలంగాణాలో 16 వారసత్వ ప్రదేశాలకు కొత్త వైభవం.. రంగం సిద్ధం!
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాలకు కొత్త వైభవం తీసుకురావటానికి తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ నడుం బిగించింది. ఈ క్రమంలో వారసత్వ చారిత్రక ప్రదేశాల సంరక్షణ, అభివృద్ధికి 8 జిల్లాల్లో మొత్తం 16 వారసత్వ ప్రదేశాలను గుర్తించింది. వాటి అభివృద్ధికి రూ.8.45 కోట్ల నిధులు కేటాయించి చర్యలు చేపట్టింది. ఈ చర్యలు చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి.
పర్యాటక శాఖ గుర్తించిన ప్రదేశాల్లో పురాతన దేవాలయాలు, కోటలు, స్మారక చిహ్నాలు, ఇతర చారిత్రక కట్టడాలు ఉన్నాయి. మొత్తం 8 జిల్లాలలో గుర్తించిన చారిత్రక కట్టడాలలో కొన్ని కాలగమనంలో నిర్లక్ష్యానికి గురై, మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్నాయి. వరంగల్ జిల్లాకు సంబంధించి కటాక్షాపూర్, ఐనవోలు, ముప్పారం వంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రపోజల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఈ సైట్లను సంరక్షించి, పర్యాటకులకు అనుకూలంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది.

ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా వారసత్వ ప్రదేశాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది.జిల్లా పర్యాటక గుర్తింపు, బ్రాండింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పింది. అభివృద్ధి పనుల్లో ప్రధానంగా నిర్మాణాల బలోపేతం, పరిసరాల అందం పెంపు, సందర్శకుల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
వీటిలో మార్గదర్శక ఫలకాలు, విశ్రాంతి స్థలాలు, లైటింగ్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, స్వచ్ఛత సౌకర్యాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో ల్యాండ్స్కేపింగ్, పచ్చదనం పెంపు కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. పర్యాటకుల రాకపోకలు పెరగడంతో స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో యువతకు చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన పెరిగి, వారసత్వ గౌరవం నిలిచిపోతోంది.
అధికారులు ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. నిధుల సద్వినియోగం, నాణ్యమైన అమలు కోసం పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్యలు రాష్ట్ర వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించే దిశగా ముఖ్యమైన అడుగుగా నిలుస్తాయి.













Click it and Unblock the Notifications
