Telangana Weather : రాబోయే 3 రోజులు తెలంగాణలో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక...
గత నెలలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వర్షాలకు బ్రేక్ పడింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజులు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది. ఈ గాలుల కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.కొద్దిరోజులుగా నెమ్మదించిన రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. మరోవైపు రాబోయే రెండు,మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటుగా, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 30శాతం(441మి.మీ) సాధారణ వర్షపాతం నమోదైందని ఇటీవల వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా ఈ పీరియడ్లో 574మి.మీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.
ఏపీ విషయానికి వస్తే... పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 15 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 48 గంటల్లో ఆ అల్పపీడనం బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. జార్ఘండ్ నుంచి ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..మరోవైపు ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటి వరకూ నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు..ఇక నుంచి నైరుతి నుంచి ఈశాన్యం వైపుకు వీయనున్నట్లు తెలిపింది.
ఈ నెల 16న కోస్తాతీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి కన్నా ఎక్కువ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.












Click it and Unblock the Notifications