అఘోరీని అబ్బాయిల జైల్లో ఉంచారా..? అమ్మాయిల జైల్లో ఉంచారా..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళను నగ్న పూజల పేరుతో మోసం చేసి రూ. 9.80 లక్షలు వసూలు చేశాడని ఫిర్యాదు అందింది.డబ్బులు తిరిగి అడిగినందుకు చంపుతానని బెదిరించాడని కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే, అఘోరీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు.
సైబరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో అఘోరీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుండి అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.ప్రస్తుతం అతడిని సంగారెడ్డి జిల్లాలోని కంది సబ్ జైలు నుండి చంచల్గూడ మహిళా జైలుకు తరలించి ప్రత్యేక బ్యారక్లో ఉంచారు.అతడితో పాటు అతడిని వివాహం చేసుకున్న వర్షిణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అఘోరీపై మరికొన్ని మోసాల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక సినీ నిర్మాతను కూడా డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, అఘోరీ తనను మోసం చేశాడని అతడి మొదటి భార్య రాధిక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీటెక్ విద్యార్థిని అయిన వర్షిణిని కూడా అఘోరీ మోసం చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications