స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్ - ఇద్దరు సీఎంలు కలిసింది ఆయన ఇంట వివాహంలోనే ..!!
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లు పోచారం చెప్పారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ లో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని స్పీకర్ పోచారం సూచించారు.
అయితే, ఈ నెల21న పోచారం మనవరాలికి...ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి కుమారుడితో వివాహం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఇద్దరు సీఎంలు చాలాసేపు అక్కడే ఉన్నారు. వారిద్దరితో పాటుగా స్పీకర్ సైతం వారి పక్కనే కూర్చుకున్నారు. వారిద్దరికీ ప్రత్యేకంగా తానే పెళ్లి భోజనం ఏర్పాటు చేసారు. సీఎంలతో పాటుగా ఏపీ..తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆ వివాహంలో పోచారంను కలిసారు.
ఇది జరిగి నాలుగు రోజులు అవుతోంది. ఇప్పుడు స్పీకర్ కు కరోనా పాజిటివ్ గా తేలటంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. అయితే, స్పీకర్ కు కరోనా లక్షణాలు ఏవీ బయట పడలేదు. రెగ్యులర్ చెకప్ లో భాగంగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆయన సైతం తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని మంత్రులు పేర్ని నాని.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. తెలంగాణ నుంచి మంత్రులతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. ఇప్పుడు పోచారం స్వయంగా తనకు పాజిటివ్ గా నిర్దారణ అయిందని చెప్పటంతో వీరు సైతం పరీక్షలు చేయించుకోవటం మంచిదనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.