రైల్వే కూలీలుగా మావోయిస్ట్ లు.. వికారాబాద్ లో అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు!
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహించి మావోయిస్టులను ఏరివేసిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్ట్ లకు గడ్డు కాలం కావటంతో మావోలు అరణ్యాలలో జీవనం సాగించటం కష్టంగా మారింది. దీంతో జనారణ్యంలోకి వచ్చి సామాన్యుల మాదిరిగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రైల్వే ట్రాక్ పనుల్లో కూలీలుగా పని చేస్తున్న నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సాధారణ కూలీల ముసుగులో మావోలు
మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన మావోయిస్ట్ లు ఛత్తీస్గఢ్లోని గడ్చిరోలి జిల్లాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల నిఘా పెరగడంతో తప్పించుకుని తెలంగాణలోకి వచ్చిన ఈ నలుగురు మావోయిస్టులు రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సాధారణ కూలీల ముసుగులో ఉన్నారు.

తాండూరు పోలీసుల సహకారంతో ఆపరేషన్
మహారాష్ట్ర పోలీసులు పొందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో తాండూరు పోలీసుల సహకారంతో ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టు అయిన వారిలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరంతా గతంలో అనేక కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.
సాధారణ కూలీల్లా జీవనం సాగిస్తున్న మావోలు
స్థానికులకు ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ కూలీల్లా జీవనం సాగిస్తూ రుక్మాపూర్ ప్రాంతంలో దాక్కున్నారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐ పరమేశ్వర్ నేతృత్వంలోని పోలీసు బృందం కూలీల నివాస స్థలాన్ని చుట్టుముట్టి నిద్రలో ఉన్న వారిని అరెస్టు చేసి ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అనంతరం నలుగురినీ మహారాష్ట్ర పోలీసులు తమ రాష్ట్రానికి తరలించారు.
స్థానికంగా మావోలపై ఆందోళన
ఈ అరెస్టు వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం గురించి స్థానికుల్లో ఆందోళన కలిగించింది. రైల్వే కాంట్రాక్టు పనుల్లో కూలీలుగా మావోలు పని చేయటం, తనిఖీలు సరిగా జరగకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో తాండూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.













Click it and Unblock the Notifications