చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో రెండు..
భారత గడ్డపై అంతరించిపోయిన చీతాలను (చిరుత పులులను) పునరుద్ధరించే 'ప్రాజెక్ట్ చీతా' మరో కీలక మైలురాయిని చేరుకుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం కూనో నేషనల్ పార్క్లోని ఎన్క్లోజర్ల నుంచి రెండు ఆడ చీతాలను స్వేచ్ఛా అడవిలోకి విడుదల చేశారు. బోట్స్వానా నుంచి తీసుకువచ్చిన ఈ చిరుతలు ఇకపై కూనోలోని సహజసిద్ధమైన అడవిలో స్వతంత్రంగా విహరించనున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. "మధ్యప్రదేశ్ చరిత్రలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్, ప్రకృతితో సహజీవనం చేసే మన సంస్కృతికి నిదర్శనం. బోట్స్వానా నుంచి తెచ్చిన ఈ రెండు ఆడ చీతాలు ఇకపై కూనో అరణ్యంలో స్వేచ్ఛగా పెరుగుతాయి" అని హర్షం వ్యక్తం చేశారు.

కూనోలో ప్రస్తుతం ఎన్ని చీతాలున్నాయి?
భారత్లో 1952లో అంతరించిపోయినట్లు ప్రకటించిన చీతాలను తిరిగి తీసుకురావడానికి 2022 సెప్టెంబర్లో నమీబియా నుంచి, ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చారు. తాజా సమాచారం ప్రకారం, కూనో నేషనల్ పార్క్లో ప్రస్తుతం 26 చీతాలు ఉన్నాయి. ఇవి కాకుండా భారత్ గడ్డపైనే పుట్టిన 12 చిరుత పిల్లలు ఉండటం విశేషం. ఇవి ఇక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడి ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. దశాబ్దాల విరామం తర్వాత, భారత గడ్డపై పుట్టిన చిరుతల సంఖ్య పెరుగుతుంటే, అది కేవలం వన్యప్రాణి సంరక్షణ మాత్రమే కాదు.. ప్రకృతిపై భారత్ సాధించిన అద్భుత విజయం! ఇటీవల దక్షిణాఫ్రికా వీరవనిత 'గామిని' ముగ్గురు పసి కూనలకు జన్మనివ్వడంతో, భారతదేశపు చీతా సైన్యం 38కి చేరుకుని కొత్త రికార్డును సృష్టించింది.
ఆర్థికం.. పర్యాటకం.. పర్యావరణం!
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంతువు చీతా.. మన దేశంలో 1952లో అంతరించిపోయిందని ప్రకటించినప్పుడు, భారత ప్రకృతి వైవిధ్యంలో ఒక పెద్ద వెలితి ఏర్పడింది. కానీ, 2022లో 'ప్రాజెక్ట్ చీతా' రూపంలో ఆ వెలితిని పూడ్చేందుకు భారత్ నడుం బిగించింది. ప్రాజెక్ట్ చీతా కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, మధ్యప్రదేశ్ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపిరి పోస్తోంది. కూనో పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకం పెరగడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
#MadhyaPradesh CM Mohan Yadav releases two cheetahs into the forest of Kuno National Park.#KunoNationalPark #Cheetah @DrMohanYadav51 pic.twitter.com/ziN0fa2GxO
— All India Radio News (@airnewsalerts) May 11, 2026
ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశాల నుంచి తెచ్చిన చిరుతలు ఇక్కడ పిల్లలను కనడం ఈ ప్రాజెక్ట్ విజయానికి నిదర్శనమని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముగింపు దశలో ఉన్నా.. ఈ చిరుతల రాకతో కూనో ఇప్పుడు 'వరల్డ్ చీతా క్యాపిటల్'గా మారుతోంది. భవిష్యత్తులో మరిన్ని చీతాలను అడవిలోకి విడుదల చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications