సీఎం కేసీఆర్ నిర్ణయంపై మంచు విష్ణు హర్షం: ప్రైవేట్ టీచర్స్, సిబ్బందికి ఆర్థిక సాయం రిలీజ్
హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి భరోసా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల టాలీవుడ్ హీరో మంచు విష్ణు హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నెలా వాళ్లకి రూ. 2వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ఓ అద్భుతమని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు తెలంగాణ సీఎం కేసీఆర్పై మరెంతో గౌరవం పెంచిందని విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కాగా, ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి నిధులు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెలలో అందించేందుకు ప్రభుత్వం రూ. 32 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాఠశాలలు తిరిగి తెరిచే వరకు ప్రతినెలా ఒక్కొక్కరికి రూ. 2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ సభ రద్దు కోరుతూ పిటిషన్
ఉపఎన్నిక జరుగనున్న నాగార్జునసాగర్లో ఏర్పాటు చేయనున్న సీఎం సభను రద్దు చేయాలని యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసిందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. అందుకే ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను రద్దు చేయాలని కోర్టును పిటిషనర్ శివకుమార్ కోరారు.
ఏప్రిల్ 14న నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ సభపై స్థానిక రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నిబంధనల ప్రకారం లక్ష మందితో సభ పెట్టడానికి వీల్లేదంటున్నారు. కరోనా పేరుతో పండగలు చేసుకోవద్దంటూనే ప్రభుత్వం లక్ష మందితో సభ ఎలా పెడుతుందని రైతులు పేర్కొన్నారు.
అయితే, కేసీఆర్ ప్రచార సభ నిర్వహించకుండా ఆపాలన్న పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టి తేల్చేందుకు హైకోర్టు నిరాకరించింది. స్వతంత్ర అభ్యర్థి సైదయ్యతోపాటు మరికొందరు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి వద్ద విచారణకు వచ్చాయి. సంబంధిత బెంచ్ కు పిటిషన్లను పంపించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేసీఈర్ కేసీఆర్ సభ నిర్వహణపై నీలి నీడలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications