అందరినీ ఆకట్టుకునే భాష రోశయ్యకే సొంతం.!నివాళులర్పించిన మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్.!
హైదరాబాద్ : రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు సొంతమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆకస్మిక మరణం పట్ల ఆమె సంతాపం ప్రకటించారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆమె చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను ఆచరించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శనం చేసిన నేత రోశయ్య అని సబిత కొనియాడారు. రాజకీయాలలో విలువలకు రోశయ్య పెట్టింది పేరని, ఆయన మరణం కచ్చితంగా ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటుగా భావిస్తున్నట్లు సబిత తెలిపారు. సుదీర్ఘ కాలం ఆంద్రప్రదేశ్ రాజకీయాలను నెరిపిన నేతగానే కాకుండా ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖామంత్రిగా చరిత్రలో నిలిచి పోయిన నేత రోశయ్యకు సబిత నివాళులు అర్పించారు.
అంతే కాకుండా మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ చాణక్యులు, మేథావి, ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థిక నిపుణులు, మాజీ మంత్రి వర్యులు రోశయ్య నేడు ఉదయం ఆకస్మికంగా మృతి చెందడంతో, హైదరాబాద్, ధరమ్ కరణ్ రోడ్డులోని ఆయన నివాసంలో రోశయ్య గారి పార్థివ దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి, నివాళులు అర్పించారు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ సందర్బంగా రోశయ్య పార్థీవ దేహం వద్ద మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ విలపించారు. రోశయ్యతో ఉన్న అనుబందాన్ని సత్యవతి రాథోడ్ నెమరు వేసుకున్నారు. రోశయ్య గారి మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని, ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులు అలంకరించారని సత్యవతి అన్నారు. అలంకరించిన పదవులన్నింటికీ రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. రోశయ్య కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు సత్యవతి రాథోడ్ తెలిపారు.