లోక్ సభ ఎన్నికల్లో చూపించిన అలసత్వం వద్దు..!పురపాలక ఎన్నకల్లో సత్తా చాటాలన్న కేటీఆర్..!!
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని తెరాస లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ మేరకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఎన్నికల సన్నాహాలపై కేటీఆర్ బుధవారం ముఖ్యనేతలతో విస్తృతంగా చర్చించారు. పుర పోరును పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఎనిమిది నెలల్లో టీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో పాల్గొంది. శాసనసభ, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని కేటీఆర్ తెలిపారు.
మరోసారి డీఎస్ రాజకీయ చతురత..! కేసీఆర్ టార్గెట్ గా బీజేపి విసిరిన బాణమేనా..?
అలసత్వం పనికి రాదు..! మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపాలని కేటీఆర్ పిలువు..!!
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పట్టణాలు, నగరాల్లో టీఆర్ఎస్ కు కొంత మెజారిటీ తగ్గింది. వీటన్నింటినీ విశ్లేషిస్తూ.. స్థానిక ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని పురపాలక ఎన్నికలకు పక్కా వ్యూహాన్ని కేటీఆర్ రూపొందించినట్లు తెలిసింది. పుర, నగర పాలక ఎన్నికలపై ఈ నెల 15 నుంచి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది. కేటీఆర్ ఎన్నికలు జరిగే అన్ని నగరపాలక సంస్థలతోపాటు ప్రధాన పురపాలక సంఘాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పురపాలక సంఘాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రచారం నిర్వహిస్తారు. వార్డులవారీగా బాధ్యతలను ముఖ్యనేతలకు అప్పగిస్తారు. ప్రచారంలో సామాజిక మాధ్యమాలను పెద్దఎత్తున వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార బృందాన్ని నియమిస్తారు.
పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలి..!పుర ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలన్న కేటీఆర్..!!
పురపాలక ఎన్నికలకు ఈ నెల 15న నోటిఫికేషన్ వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. 15 నుంచి 20వ తేదీ మధ్యలో టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వ్యూహాన్ని వెల్లడిస్తారు. ఆ వెంటనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నడుస్తుంది. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల అభ్యర్థులను అధిష్ఠానమే ఖరారు చేయనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యుల ఆధ్వర్యంలో ఉమ్మడి కమిటీని వేస్తారు. ఆశావహుల పేర్లను తీసుకుంటారు. ఈ జాబితా అధిష్ఠానం వద్దకు చేరుతుంది. ఆయా అభ్యర్థుల గురించి అధిష్ఠానం ఆరా తీస్తుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సర్వేలను నిర్వహిస్తారు. వీటిని ప్రామాణికంగా తీసుకొని అన్నివిధాలా అర్హులైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కేసీఆర్ వ్యూహరచన..! నేతలతో సమాలోచనలు..!!
అవినీతిని సమూలంగా నిర్మూలించడం, ఏ మాత్రం లంచాలు ఇచ్చే అవసరం లేకుండా.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే నగర రెవెన్యూ, గ్రామీణ విధానాలను దృఢచిత్తంతో రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. కొత్త విధానాలు, నూతన పురపాలక చట్టం, ఇతర అంశాల మీద సీఎం చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం కాంక్షతో పటిష్ఠమైన కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం. దీంతో గ్రామాల అభివృద్ధి సాగుతోంది.. మూడు నెలల్లో మార్పు చూడబోతున్నాం. ఇప్పుడు అవినీతిని అరికట్టే దిశగా తెలంగాణ నూతన పురపాలక చట్టం ఉండాలి. ప్రభుత్వం నుంచి ఉత్తమ విధానాలు రావాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తితోనే కొత్త పుర చట్టం రావాలి. ప్రజల అవసరాలను తీర్చే విధంగా, వారి సంక్షేమం చూసుకునే రీతిలో, పట్టణాల అభివృద్ధి క్రమపద్ధతిలో జరగాలన్నారు.
నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అభ్యర్థుల ఎంపిక..! కసరత్తు చేస్తున్న సీఎం..!!
పుర చట్టాన్ని రూపొందించిన తర్వాత దానిపై అవగాహనకు పురపాలక కమిషనర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రజల మేలు కోసం కఠిన నిర్ణయాలుంటాయి. రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేశాం. అనుకున్నది సాధించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేశాం. అన్నింటికన్నా ముఖ్యమైన మంచినీటి, సాగునీటి, విద్యుత్ సమస్యలను అధిగమించాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ అన్ని ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు. సమీక్షా సమావేశంలో సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పాల్గొన్నారు.