పీకలపై కత్తులు పెట్టి పట్టపగలు ఇంట్లో దోపిడీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పట్టపగలు ఇంట్లో దోపిడీ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో అత్తాకోడలు వంట గదిలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో బయట నుంచి ఎవరో పిలిచారు. కావల్సిన సమాచారం అడిగి వెళ్లిపోయారు. అదే వ్యక్తులు కాసేపటికి నేరుగా ఇంట్లోకి వచ్చి కత్తులను పీకలపై పెట్టారు. బెదిరించి 25 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఈ ఘటన హైదరాబాదులోని సైదాబాద్లోని ఎస్ఎన్రెడ్డినగర్ గ్రీన్పార్కు కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
రోడ్డు నంబర్ నాలుగులో నివాసముంటున్న శ్యాంరావు దేశ్ముఖ్ క్యాటరింగ్ చేస్తుంటారు. ఆయన కుమారుడు సుధీర్ దేశ్ముఖ్ మార్చుల్ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇద్దరూ బయటకు వెళ్లగా ఇంట్లో అత్తాకోడళ్లు రజనీ దేశ్ముఖ్, అపర్ణా దేశ్ముఖ్ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో అత్తాకోడలిద్దరూ వంటగదిలో పనులు చేసుకుంటున్నారు. ఇంతలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చారు.
31వ తేదీ రాత్రి తమకు క్యాటరింగ్ చేయాలని చెప్పారు. శ్యాంరావు దేశ్ముఖ్ ఇంట్లో లేరని, ఏదైనా విషయం ఉంటే ఫోన్లో మాట్లాడమని రజినీ, అపర్ణ వారికి విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు తీసుకుని వెళ్లిపోయిన వారు సరిగ్గా 15 నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు. గది తలుపు తీసి ఉండడంతో నేరుగా లోపలికి ప్రవేశించారు. అరిస్తే చంపేస్తామని కత్తులు చూపించారు. భయపడ్డ అత్తాకోడలు నోరు మెదపలేదు. వారిని పూజ గదిలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టి బంధించారు.
ఇల్లంతా వెతికి బీరువాలో ఉన్న బంగారంతో పాటు రజనీ, అపర్ణ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. తాము అన్నలమని, అడవుల్లో ఉంటామని, ఈ విషయం ఎవరికైనా చెప్పారా... చంపేస్తామని బెదిరించారు. తర్వాత పూజ గది నుంచి వారిని పడక గదిలో బంధించారు. పూజ గదికి బయట గడియ లేకపోవంతో పడక గదికి మార్చారు. దీనికి బయట గడియపెట్టి దుండగులు పరారయ్యారు.
దుండగులు కత్తులతో బెదిరించడంతో అత్తాకోడలిద్దరూ షాక్కు లోనయ్యారు. 15 నిమిషాల తర్వాత తేరుకున్న వారు కిటికీలో నుంచి పక్కంటి వారిని పిలిచి గడియ తీయించుకున్నారు. అనంతరం ఈ విషయం శ్యాంరావుకు తెలిపారు. మలక్పేట ఏసీపీ సుధాకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు.
చోరీకి వచ్చిన దుండగులలో ఒకరి వయస్సు 50 ఏళ్లు ఉంటుంది. మిగిలిన ముగ్గురూ 25-30 ఏళ్ల మధ్య ఉంటారు. వీరంతా తెలంగాణ యాసలోనే మాట్లాడుకున్నారు. పైగా అందరూ మద్యం మత్తులో ఉన్నారు. వీరిలో 50 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి లోగడ చూసినట్టుగా ఉందని రజనీ చెబుతున్నారు. ఇంట్లో నగదు కనిపించకపోవడంతో కోడలు అపర్ణను చంపేస్తామని వారు బెదిరించారని చెప్పారు.
దుండగుల్లో పెద్దాయన ఒక్కరే మంచిగా మాట్లాడాడని, మిగిలిన నలుగురూ కోడలిని చంపే ప్రయత్నం చేయగా అడ్డుకున్నాడని ఆమె తెలిపారు. ఈ వివరాలన్నీ సేకరించిన పోలీసులు లోగడ శ్యాంరావు కుటుంబానికి తెలిసిన వారే ఈ పనిచేశారని అనుమానిస్తున్నారు.