BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం..!
తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన కాషాయ పార్టీ తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ తో సమానంగా సీట్లు సాధించింది. బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, నగేశ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి, డీకే అరుణ విజయం సాధించారు. ఇందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి త్వరలో తప్పుకునే అవకాశం ఉంది.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నందున అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అలాగే బీజేపీ అధిష్ఠానం కూడా తెలంగాణలో సంస్థాగత మార్పులు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని చూస్తోంది. దీంతో అధ్యక్ష పదవికి కోసం పలువు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్ని చేకురుస్తున్నాయి. పార్టీలో కొత్త నీరు, కొత్త శక్తి అవసరం అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

మరోవైవు దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న వారికే పగ్గాలు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరుతున్నారు. అందరి సలహాలు తీసుకున్న తర్వాతే హైకమాండ్ ప్రకటన చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంపీ డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్ కూడా అధ్యక్ష పదవి కోరుతున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం.
బీజేపీ అధినాయకత్వం బీసీకే పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ కే అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications