నేడు హైకోర్టులో కాళేశ్వరంపై విచారణ..! మల్లన్నసాగర్ పై స్టే విధించలేమన్న హైకోర్టు..!!
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో గురువారం కాళేశ్వరం పిటీషన్లను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఇంకా జరుగుతుండడంతో చంద్రశేఖర్ రావు సర్కారు హైకోర్టును త్వరగా పిటీషన్లను విచారించాలని కోరింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు అందగా, వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించింది. కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరిగింది.
మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న అనంతరం మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పనులపై స్టే విధించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది. అయితే పరిహారంలో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని న్యాయస్థానం సూచించింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పరిహారం తీసుకోని 46 మంది చెక్కులను.. నిర్వాసితుల తరపు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది.