రేపు కాంగ్రెస్ ఛలో రాజ్భవన్-అనుమతి నిరాకరించిన పోలీసులు-అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామన్న రేవంత్
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనకు తెలంగాణ కాంగ్రెస్ ఛలో రాజ్భవన్కు పిలుపునిచ్చింది.శుక్రవారం(జులై 16) ఉదయం 10గంటలకు ఇందిరా పార్క్ నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. రాజ్భవన్లో కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
అటు ప్రధాని మోదీ,ఇటు సీఎం కేసీఆర్ పెట్రోల్,డీజిల్ ధరలపై భారీగా వ్యాట్ను వసూలు చేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్పై ఇప్పటివరకూ ప్రజల నుంచి రూ.35లక్షల కోట్లు వసూలు చేశాయని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని... పార్లమెంటును కూడా స్తంభింపజేస్తామని అన్నారు. ధరలు తగ్గించేంతవరకూ పోరాటం చేస్తామన్నారు.
మరోవైపు కాంగ్రెస్ తలపెట్టిన ఛలో రాజ్భవన్కు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. కోవిడ్,శాంతిభద్రతల దృష్ట్యా ర్యాలీకి అనుమతినివ్వమని తెలిపారు. కావాలంటే ఇందిరా పార్క్ వద్దే కేవలం రెండు మైక్ స్పీకర్లతో ధర్నా నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు. అంతే తప్ప ర్యాలీకి అనుమతినిచ్చేది లేదని స్పష్టం చేశారు.మరోవైపు పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఛలో రాజ్భవన్ చేపట్టి తీరుతామన్నారు.
ఒకవేళ పోలీసులు అడ్డగిస్తే ఛలో పోలీస్ స్టేషన్లకు పిలుపునిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని... ఎంతమందిని జైళ్లలో పెడుతారో చూస్తామని హెచ్చరించారు. దీంతో శుక్రవారం(జులై 16) ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులకు పోలీసులు సిద్ధమవుతుండగా ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కాగా,దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల విరామం తర్వాత ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటరు పెట్రోల్పై 31 పైసల నుంచి 39 పైసలు పెరిగింది. లీటరు డీజిల్ 15 పైసల నుంచి 21 పైసల మేర పెరిగింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54కి,డీజిల్ ధర రూ.97.45కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.54,డీజిల్ రూ.89.85గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.94కి చేరగా... చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.23కి,లీటర్ డీజిల్ ధర రూ.94.39కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.105 పైనే ఉంది. దాదాపుగా రూ.110కి పెట్రోల్ ధర చేరువవుతోంది.