రాజ్యాంగం రద్దుకు కుట్ర.. బీజేపీ ఆలోచన - కేసీఆర్ ప్రతిపాదన : రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిన్న మీడియా సమావేశంలో కేసీఆర్.. కల్తీ కళ్లు తాగి వచ్చినట్లు చిత్ర విచిత్రంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు , ప్రయోజనాలపై మాట్లాడలేదన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి నీచంగా.. జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగం రద్దు బీజేపీ ఆలోచనలనే ..
రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న సీఎం కేసీఆర్ ప్రతిపాదన విచిత్రంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. భూస్వాములు, అగ్ర వర్ణాలు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగాన్ని కోరుతున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ ఆలోచనలనే ఇక్కడ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ , ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలనేది బీజేపీ మోచన అని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ తన ఆలోచనను కేసీఆర్ ద్వారా మాట్లాడిస్తోందని విమర్శించారు.

కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం
దేశ రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. వారి కుట్రకు కేసీఆర్ వంత పాడారని విమర్శించారు. కేసీఆర్ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీడికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రద్దు యోచనకు వ్యతిరేకంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రులు పర్యటనలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ గాంధీ భవన్లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన దేశంలో ఏ ఒక్కరికీ ప్రయోజనం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల పండించిన పంటలకు మద్దతు ధరపై విధి విధానాలు తీసుకోస్తారని భావించాం.. కానీ వాటిపై ఎలాంటి ప్రకటన లేదన్నారు. రైతుల పట్ల ప్రధాని మోదీ ఎంత రగిలిపోతున్నారో బడ్జెట్ ద్వారా అర్థమైందన్నారు. దేశ ప్రజలు, యువతను ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చేలా లేదన్నారు. ఎరువులపై సబ్సిడీ కూడా తగ్గించారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 25 వేల కోట్ల నిధుల కోత విధించారని ఆరోపించారు.

యూపీలో బీజేపీకి కేసీఆర్ మద్దతు
ఉత్తరప్రదేశ్లో బీజేపీని గెలిపించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, అసదుద్ధీన్ ఒవైసీ గ్యాంగ్ మోదీ సుపారీ దగ్గర తీసుకుందని ఆరోపించారు. యూపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. అక్కడ బీజేపీ మంత్రులను ప్రజలు, రైతులు తరిమి కొడుతున్నారు. ఇది కేసీఆర్కు కన్పించడంలేదా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యంగం రద్దు ఆలోచనను కేసీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు. లేకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications