టీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు.. 'డ్రగ్స్' ఎమ్మెల్యేలపై చర్యలేవి,మల్లారెడ్డి వసూళ్లలో కేసీఆర్కు వాటా ఉందా?: ఉత్తమ్
మంత్రి మల్లారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయరని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మల్లారెడ్డికి కళ్లు నెత్తికెక్కి బహిరంగ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికార మదంతో,అక్రమాలతో దుష్ట పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని... తెలంగాణ పరువు తీసిన ఆ నలుగురిని అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో శుక్రవారం(ఏప్రిల్ 9) నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.
కేసీఆర్కు వాటా ఉందా...? : ఉత్తమ్
మంత్రి మల్లారెడ్డి లంచం డిమాండ్ చేస్తూ ఆన్ రికార్డ్ పట్టుబడితే ఆయన్ను ఎందుకు బర్తరఫ్ చేయట్లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. మల్లారెడ్డి వసూళ్లలో సీఎం కేసీఆర్కు వాటా వస్తుందా... అందుకే బర్తరఫ్ చేయట్లేదా అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ భూ కబ్జాలు, ఇసుక, మద్యం అక్రమాలకు పాల్పడ్డ టీఆర్ఎస్ నేతలు.. కొత్తగా డ్రగ్స్ దందాలో కూడా వేలు పెట్టారు ఉత్తమ్ విమర్శించారు. డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులే వెల్లడించారని చెప్పారు. ఈ విషయమై తాను కూడా అక్కడి అధికారులతో మాట్లాడగా... డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేలు ఉన్న మాట వాస్తవమేనని చెప్పారన్నారు. గత శాసనసభలో అకారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించారని... ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడినవారిని కచ్చితంగా బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు : ఉత్తమ్
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యేలు కర్ణాటక బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడుకుని కేసులు మాఫీ చేయించుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్,బీజేపీల మధ్య ఒక అవగాహన ఉందని... సాగర్ ఉపఎన్నికలోనూ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ను గెలిపించేందుకే బీజేపీ బలహీనమైన అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సాగర్ ఉపఎన్నిక నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని... ఎన్నికల్లో ధన,మధ్య ప్రవాహం లేకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవిస్తామని చెప్పారు.
సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం : ఉత్తమ్
తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఇసుక దందా నడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యలో అక్కడి జడ్పీ ఛైర్మన్ పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు లేవన్నారు. నాగార్జునసాగర్లో టీఆర్ఎస్కు బుద్ది చెబితే గానీ వాళ్లు సోయికి రారని విమర్శించారు. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని... అందుకే మనకు రావాల్సిన నీళ్లు ఆంధ్రా ప్రాంతం దోపిడీ చేస్తున్నా నోరు మెదపట్లేదని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతున్నా... సంఘమేశ్వర లిఫ్ట్ నిర్మాణం చేపడుతున్నా కేసీఆర్ దానిపై ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి ఇక నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని... సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల నీళ్ల కోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్... శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నాగార్జునసాగర్కు రావాల్సిన నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతున్నా ఏమీ మాట్లాడటం లేదని అన్నారు.
Recommended Video