ఆ ఇంటర్ విద్యార్థి ఐసిస్ ఉగ్రవాది కాదు: స్పష్టం చేసిన ఎన్ఐఏ
హైదరాబాద్: ఎన్ఐఏ అధికారులు ఐసీస్ సానుభూతి పరుడిగా అనుమానించి బుధవారం తెల్లవారుజామున ఇంటర్ చదివే మహ్మద్ అజహర్ (20) అనే విద్యార్ధిని పొరపాటున అదుపులోకి తీసుకోవడం అతడి కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసింది. బుధవారం నాడు పాతబస్తీలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న 11 మంది నిందితుల్లో ఒక ఇంటర్ విద్యార్థి ఉన్న సంగతి తెలిసిందే.
రంజాన్ నేపథ్యంలో మసీదులో సెహరీ ముగించుకున్న అజహర్ నిద్రించడానికి ఉపక్రమించాడు. అదే సమయంలో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి అతడి ఇంటిపై రెయిడ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఎన్ఐఏ అధికారుల వెంట తీసుకెళ్లారు.
ఐసిస్ ఉగ్రవాదులతో తనకున్న సంబంధాల గురించి అర్ధరాత్రి వరకు ప్రశ్నించి, అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లభించకపోవడంతో వదిలేశారు. అనంతరం అజహర్ మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులు వెళ్లే మసీదుకే (బీబీ బజార్ క్రాస్రోడ్స్లోని ముహమ్మదీ మసీదు) తాను వెళ్తున్నందునే ఐఎస్ మాడ్యూల్లో ఒకరిగా అనుమానించారని అతడు తెలిపాడు.
''వారు మా ఇంటిని తనిఖీ చేశారు. ఆ తర్వాత.. ఎన్ఐఏ అరెస్టు చేసిన ఐదుగురు యువకులతో నాకున్న సంబంధాలేంటని ప్రశ్నించారు. వారిని తరచుగా స్థానిక మసీదులో చూస్తూ ఉండేవాడిని, అంతకు మించి వారితో ఎలాంటి స్నేహం లేదని, వ్యక్తిగతంగా వారి గురించి నాకేమీ తెలియదని చెప్పాను'' అని అజహర్ వివరించాడు.
వారు తన ఫోన్ కాంటాక్ట్స్ను నిశితంగా పరిశీలించారని ఏమీ అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో వదిలిపెట్టారని.. ప్రశ్నించే సమయంలో వారు తనతో మర్యాదగానే ప్రవర్తించారని అజహర్ పేర్కొన్నాడు. అయితే నిఘా వర్గాలు మసీదు వద్ద ఫొటోలు తీసినప్పుడు అజహర్ యాదృచ్ఛికంగా ఆ ఐదుగురు యువకుల సమీపంలో కనిపించడంతో ఎన్ఐఏ వర్గాలు అనుమానించి ఉంటాయని అతడి సమీప బంధువు ఫహీంఖాన్ తెలిపారు.
ఏదిఏమైనప్పటికీ, అజహర్ను అనవసరంగా ఈ కేసులోకి లాగారని అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కగా చదువుకుంటున్న కుర్రాడు.. ఐసిస్ సానుభూతిపరుడిగా మీడియాలో ప్రచారం కావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.