హైదరాబాద్ - విజయవాడల మధ్య 70 కి.మీ. దూరం తగ్గుతుంది: బిగ్ ప్రాజెక్ట్
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

- జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపు, సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా ఆ తర్వాత ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం జరగొద్దని, అలాంటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. భూ సేకరణను పూర్తి చేయడమే కాకుండా పరిహారం తక్షణమే అందేలా చూడాలని చెప్పారు.
- రీజినల్ రింగు రోడ్డు- నార్త్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాలను నివృత్తి చేస్తున్నప్పటికీ కొత్త సమస్యలను ఎందుకు వస్తున్నాయని ఎన్హెచ్ఏఐ అధికారులను ప్రశ్నించారు. సందేహాలన్నింటిని ఒకేసారి పంపాలని కోరినప్పుడు, ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉంటే వెంటనే పంపుతామని తెలిపారు.
- ఆర్ఆర్ఆర్- సౌత్, ఉత్తర భాగాలు రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దని, సౌత్కు కూడా నార్త్కు ఇచ్చిన నెంబర్ను కొనసాగించాలని సూచించారు. వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు ఎన్హెచ్ఏఐ సహకరించాలని కోరారు. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్మెంట్కు వెంటనే ఆమోదముద్ర వేయాలని చెప్పారు.
- భారత్ ఫ్యూచర్ సిటీ - అమరావతి - మచిలీపట్నం 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
- ఈ గ్రీన్ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడడంతో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని, హైదరాబాద్ - విజయవాడల మధ్య 70 కి.మీ దూరం తగ్గడంతో పాటు సరుకు రవాణాతో దేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ, ఆదాయం ఈ గ్రీన్ఫీల్డ్ హైవేతో ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గం వేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. బెంగళూరు - శంషాబాద్ ఎయిర్పోర్ట్ -అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని తెలిపారు. వందేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోకలకు ఇది అనువుగా ఉండటమే కాకుండా లాభసాటిగా ఉంటుందని చెప్పారు.
- మంచిర్యాల - వరంగల్ - ఖమ్మం - విజయవాడ జాతీయ రహదారి (NH-163G), ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల (NH-63), జగిత్యాల - కరీంనగర్ (MH-563), మహబూబ్నగర్ - మరికల్ - దేవ్ సుగూర్ (NH-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రిప్రశ్నించారు.












Click it and Unblock the Notifications