ప్రపంచంలో ఏ నేతపైనా ఈ స్థాయి దాడి జరగలేదు: అమర జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాద్: అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి అని.. ఉద్యమ ప్రస్థానం చిరస్థాయి ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారకం, అమర జ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. అమరులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబసభ్యులను సీఎం, మంత్రులు సత్కరించారు.
జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు కేసీఆర్. ఈరోజు రెండు పార్శ్వాలు కలిగలసి ఉన్నాయి. నిన్నటిదాకా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం. ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని నిర్ణయించాం. దీంతోనే అమర జ్యోతి ప్రారంభం చివరి దశలో పెట్టుకున్నామన్నారు. మీరందరూ విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబూని అమరులకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ సాధించి తీరామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలికేక వినిపించింది. ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమధనం చేశాం. వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన మార్గదర్శనంలోనే నడిచాం. ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ కాపాడుకొంటూ వచ్చారని సీఎం కేసీఆర్ చెప్పారు. రాజీనామాలు అస్త్రాలుగా వాడి ఉద్యమం నడిపామన్నారు.
తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపామన్నారు. తన నిరాహార దీక్ష తర్వాతే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో కుట్రలు జరిగాయి. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లే స్థాయికి దిగజారారు. ఉద్యమంలో విద్యార్థుల ఆత్మబలిదానాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. అత్యుత్తమంగా నిర్మించుకున్నందుకే అమరవీరుల స్థూపం నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సందర్భంగా 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతిపై ప్రదర్శన ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు.

'అమర దీపం' విశేషాలు
రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 'అమర దీపం' హుస్సేన్ సాగర్ తీరాన ప్రతి రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది.
అమరుల స్మారక భవన నిర్మాణ వివరాలు:
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా ఆరు అంతస్తుల్లో ప్రభుత్వం అమరవీరుల జ్యోతిని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్కు సమీపంలో 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందు కోసం కేటాయించింది. ఈ స్థలంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. 54, 37 అక్షాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ప్రమిదను రూపొందించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు, మరో వైపు 18 మీటర్ల ఎత్తుతో, మొత్తంగా గ్రౌండ్ లెవల్ నుండి 45 మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. స్మారక భవనం నిర్మాణానికి మొత్తంగా 1,600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్ ను వినియోగించారు.
అంతస్తుల వారీగా వివరాలు:
బేస్ మెంట్ - 1: దీని విస్తీర్ణం 1,06,993 చదరపు అడుగులు. 160 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం వుంది.
బేస్ మెంట్ - 2: ఇది 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మితమైంది. 175 కార్లు, 200 ద్విచక్రవాహనాలకు పార్కింగ్ సౌకర్యం. లాంజ్ ఏరియా, లిఫ్ట్ లాబీ, భూగర్భంలో 3 లక్షల లీటర్ల నీటి సామర్థ్యమున్న సంప్ (నీటి గుంట)లను ఏర్పాటు చేశారు.
Tribute to Telangana Martyrs | CM Sri KCR Inaugurating the Telangana Martyrs' Memorial in Hyderabad. #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaFormationDay https://t.co/kHiks3KzAj
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2023
గ్రౌండ్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 28,707 చదరపు అడుగులు. ఇందులో మెయింటనెన్స్, సివిల్, ఎలక్ట్రికల్ కార్యకలాపాలు.
మొదటి అంతస్తు: దీని విస్తీర్ణం 10,656 చదరపు అడుగులు. ఇందులో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో, విజువల్ రూమ్.
రెండవ అంతస్తు: దీని విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు. కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా.
మూడవ అంతస్తు (టెర్రస్): దీని విస్తీర్ణం 8,095 చదరపు అడుగులు. కూర్చునే ప్రదేశం, ప్యాంట్రీ ఏరియాతో కూడిన రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ వున్నాయి.
మెజ్జనైన్ ఫ్లోర్: దీని విస్తీర్ణం 5,900 చదరపు అడుగులు. గ్లాస్ రూఫ్ తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంకు
అమర దీపం: తక్కువ కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్ తో తయారైన 26 మీటర్ల జ్వాల. ఇది గోల్డెన్ ఎల్లో కలర్ లో ప్రకాశిస్తుంది.












Click it and Unblock the Notifications