టీఆర్ఎస్,బీజేపి పోటాపోటీ సభలు.!అమీత్ షా సభకు ధీటుగా కేటీఆర్ సభ.!ఏర్పాట్లలో ముఖ్య నేతలు.!
హైదరాబాద్ : తెలంగాణలో కమలం, గులాబీ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ నెల 14 న రాష్ట్ర పురపాలక మరియు ఐటి,పరిశ్రమల శాఖామంత్రి కలువకుంట్ల తారకరామారావు నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పర్యటనను పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ విజయవంతానికి ముమ్మురంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం రోజు సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, స్థానిక శాసనసభ్యులు నోముల భగత్,నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య తో పాటు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి హాలియా మున్సిపల్ పరిధిలో సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక అదే రోజు బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాద యాత్ర ముగింపు సందర్బంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.
శనివారం జరగనున్న అమిత్ షా సభకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు బీజేపి ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. షా సభ విజయవంతం కోసం బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పగలు పాదయాత్ర చేస్తూ, రాత్రి వేళల్లో పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తోన్నారు బండి సంజయ్. మహేశ్వరం సభ కోసం అమిత్ షాపై ప్రత్యేక పాటను కూడా రూపొందించారు. మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ లో జరిగే "ప్రజా సంగ్రామ యాత్ర-2" ముగింపు సభ ద్వారా తెలంగాణలో ఓ సంచలనం సృష్టించాలనే కృతనిశ్చయంతో బీజేపి ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 14న అమిత్ షా' పాల్గొనే ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నట్టు గతంలో బండి సంజయ్ ప్రకటించిన అంశం తెలిసిందే. 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉందని, ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని బండి సజయ్ పిలుపునిచ్చారు. అటు బీజేపి, ఇటు టీఆర్ఎస్ బహిరంగ సభలు ఒకే రోజు ఉండడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.