'కర్నాటక కడ్తుంటే ఏపీతో కెసిఆర్ గొడవ, భార్యలు అన్నం పెట్టకున్నా టిడిపినే'
హైదరాబాద్: కర్నాటక అక్రమ ప్రాజెక్టుల పైన కెసిఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని, ఎగువ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. దిగువ రాష్ట్రమైన ఏపీతో గొడవ పడుతున్నారని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, అరికెల నర్సిరెడ్డి, ప్రకాశ్ గౌడ్ మండిపడ్డారు.
బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక కెసిఆర్ సీఎం అయితే ప్రజలు బాగుపడుతారనుకుంటే, అలా జరగడం లేదన్నారు.
ప్రాజెక్టుల డిజైన్ మార్పు సరికాదన్నారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ నేతల వైఖరితో రాష్ట్రం ఏడారిగా మారే పరిస్థితి వస్తోందన్నారు. ప్రాణహిత - చేవెళ్ల డిజైన్ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు.

ఓ వైపు అల్మట్టి ఎత్తును కర్నాటక పెంచుతుంటే కెసిఆర్ ఫాంహౌస్లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తిగా కరువు కాటకాల్లో ఉండే వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్ ఘనపూర్కు దేవాదుల ప్రాజెక్టు వల్లే నీరు వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఊరుకోమన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణా రావుకు మతిభ్రమించిందన్నారు. టిఆర్ఎస్ నేతలకు వారి భార్యలు అన్నం పెట్టకపోయినా టిడిపినే కారణం అనేట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కర్నాటక ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులపై తమ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయనున్నారన్నారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చవద్దని రేపు ఒక రోజు దీక్ష చేస్తామని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత నీళ్లు రాకుండా పోతాయన్నారు. నాడు కాంగ్రెస్ తెలంగాణకు గోదావరి నీళ్లు రాకుండా చేసిందని, ఇప్పుడు టిఆర్ఎస్ అల్మట్టిని అడ్డుకోకుండా కృష్ణా నీరు రాకుండా చేస్తోందన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు పైన టిడిపి పోరాడితే రెండు టీఎంసీలకు ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారని, అది రెండు టిఎంసీలు కాదని, వంద టీఎంసీల నీరు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కృష్ణా నీటికి అదే గతి పట్టించబోతున్నారన్నారు.












Click it and Unblock the Notifications