టీఆర్ఎస్కు షాక్: ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరిన తాడురి వెంకటరెడ్డి
హైదరాబాద్: బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మరికొందరు టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డిలు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు చెంప ఛెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి పార్టీ నేతలకు వెగటు పుట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు.గులాబీ కండువాను వదిలేస్తున్నవారిపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్ అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. పిచ్చివేషాలు వేసి లొంగదీసుకుంటామంటే తెలంగాణ సమాజం లొంగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇన్నేళ్లు కష్టపడి పనిచేశామని, మరో 6 నెలలు ఇలాగే కష్టపడితే అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video

కాగా, తాను బీజేపీలోకి చేరుతున్నాననే తనను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని తాడురు వెంకటరెడ్డి ఆరోపించారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని అన్నందుకే తనను దూరం పెట్టారని అన్నారు. తనతోపాటు చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications