ఎన్టీఆర్ ఘాట్ కు టీఆర్ఎస్ నేతలు : కలిసి కట్టుగా వారంతా ఒకేసారి - కొత్త సమీకరణం..!!
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు..దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మదినం నేడు. రాజకీయంగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముద్ర చెరగనిది. ఆయన స్పూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారు ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా కీలక స్థానాల్లో ఉన్నారదు. ఇక, ఈ రోజు నుంచి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అయితే, ఈ సారి అనూహ్యంగా టీఆర్ఎస్ నేతలు కలిసి కట్టుగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.
మాజీ టీడీపీ..ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు
గతంలో ఎప్పుడూ ఈ విధంగా గులాబీ పార్టీ నేతలంతా ఇలా కలిసి కట్టుగా వచ్చి ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన సందర్భాలు లేకపోవటంతో ఈ సారి ఈ పరిణామం ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. అందునా... గతంలో టీడీపీలో పని చేసి..టీఆర్ఎస్ లో చేరిన నేతలంతా ఒక్కటిగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుకున్నారు.
టీడీపీ మాజీ ఎంపీ..ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నాయకత్వంలో వారంతా ఘాట్ వద్దకు వచ్చారు. టీడీపీలో ఎంపీగా పని చేసిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి.. పువ్వాడ అజయ్ ..సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. టీడీపీ మాజీ నేతలు..ప్రస్తుత ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ.. వివేకానంద.. మాగంటి గోపీనాధ్ సహా పలువురు ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు.
మారుతున్న సమీకరణాలతో ఒక్కసారిగా
ఎన్టీఆర్ ప్రధాని కావాల్సిన వ్యక్తి అంటూ టీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ కు భారత రత్న కోసం ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ సైతం ఎన్టీఆర్ పేదల కోసం పడిన తపన గురించి వివరించే వారంటూ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, గతం కంటే భిన్నంగా మాజీ టీడీపీ నేతలంతా..ప్రస్తుతం టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తూ..ఇలా ఎన్టీఆర్ కు నివాళి అర్పించటం వెనుక వ్యూహం ఏంటనేది చర్చకు కారణంగా మారింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.
గులాబీ నేతల అడుగులు..రాజకీయ చర్చలు
జాతీయ రాజకీయాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ రెండు మూడు నెలల్లో సంచలన నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఇక, జాతీయ రాజకీయాల్లో తెలుగు గడ్డ నుంచి తొలి అడుగు వేసింది ఎన్టీఆర్. ఇప్పుడు గులాబీ పార్టీ నేతలు ఎన్టీఆర్ కు కలిసి కట్టుగా నివాళి అర్పించటం వెనుక ఎటువంటి రాజకీయం లేదని..ఎన్టీఆర్ శత జయంతి కావటంతోనే.. ఆయనకు నివాళి అర్పించామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలోనూ వారు నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనునున్నారు. ఇప్పుడు ఈ విషయం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.